బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

two bikes collided..two dead - Sakshi

మరొకరి పరిస్థితి విషమం

మైలారం శివారులో ఘటన   

శాయంపేట(భూపాలపల్లి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు  మృతిచెందిన సంఘటన మండలంలోని మైలారం గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన ముల్కనూరి శ్రీనివాస్‌(35), రేణుకుంట్ల సాంబయ్య మండల కేంద్రంలో మేస్త్రీ పనులు చూసుకుని ఒకే ద్విచక్ర వాహనంపై మైలారం మీదుగా పెద్దకోడెపాక గ్రామానికి వెళ్తున్నారు.

అదే సమయంలో రేగొండ మండలం  కానిపర్తి గ్రామానికి చెందిన శ్రీపతి నరేశ్‌(25), పాలకుర్తికి చెందిన నల్ల సురేష్‌  మరో ద్విచక్ర వాహనంపై పెద్దకోడెపాక మీదుగా మైలారం గ్రామానికి వివాహానికి  హాజరయ్యేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మైలారం శివారులో మూలమలుపు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.

దీంతో ముల్కనూరి శ్రీనివాస్, శ్రీపతి నరేశ్, రేణుకుంట్ల సాంబయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో పరకాల సివిల్‌ ఆస్పత్రికి  తరలించగా చికిత్స పొందుతూ ముల్కనూరి శ్రీనివాస్‌ మృతిచెందాడు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీపతి నరేశ్‌ మృతిచెందాడు. సాంబయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో  మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్పగాయాలైన సురేశ్‌ హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top