భార్య వివాహేతర సంబంధం.. ఒకే కుటుంబంలో! | Three Members Of A Family Suicide Attempt In Rangareddy | Sakshi
Sakshi News home page

భార్య వివాహేతర సంబంధం.. ఒకే కుటుంబంలో!

Nov 25 2018 10:31 AM | Updated on Nov 25 2018 11:01 AM

Three Members Of A Family Suicide Attempt In Rangareddy - Sakshi

హన్మంతు, చంద్రకళ (ఫైల్‌)  మంజుల (ఫైల్‌)

ఇబ్రహీంపట్నం రూరల్‌: కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన ఎస్‌.హన్మంతుకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు. ఆయన రంగారెడ్డి జిల్లా కుర్మల్‌గూడలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్నారు. హన్మంతు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. హన్మంతుకు చంద్రకళతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే, కుమారుడు కావాలని హన్మంతు చంద్రకళ చెల్లెలు సూజాతను ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

తరువాత చంద్రకళకు కొడుకు పుట్టాడు. సూజాతకు కూడా కొడుకు, కూతురు పుట్టారు. అందరూ కలిసి జీవిస్తున్నారు. కాగా, కొంత కాలంగా రెండవ భార్య సూజత వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో హన్మంతు మందలించాడు. ఇలా చేయడం తగదని చెప్పినా వినిపించుకోకపోవడంతో చేయిచేసుకున్నాడు. ఈ నెల 18న సుజాత తన కుమారుడిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాబును హన్మంతు ఇంట్లోనే వదిలేసింది. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో సహజీవనం చేస్తుందనే విషయం హన్మంతు, చంద్రకళకు తెలిసింది. దీంతో వారు కొద్ది రోజులుగా మానసిక క్షోభకు గురవుతున్నారు. సుజాతపై వారు అప్పట్లోనే ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది.

అయితే,  శుక్రవారం రాత్రి పిల్లలు హాల్‌లో పడుకొని ఉండగా.. హన్మంతు (40), చంద్రకళ(30), చిన్న కూతురు మంజుల(8)లు పడక గదిలో ఒకే తాడుకు ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నారు. హాల్‌లో పడుకున్న ముగ్గురు పిల్లలు నిద్రలేచి కిటికిలో నుంచి చూసి భయబ్రాంతులకు గురయ్యారు. ఎడుస్తూ కేకలు పెట్టడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూశారు. పైనే నివాసం ఉన్న హన్మంతు అక్క తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్లి చూసే సరికి విగత జీవులుగా వేలాడుతున్నారు.  ఆదిబట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నరేందర్, ఎస్‌ఐ రామకృష్ణ వచ్చి మృతదేహాలను కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. గదిలో సుసైట్‌నోట్‌ లభించినట్టు తెలిసింది. అయితే పోలీసులు ధ్రువీకరించలేదు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. సాయి, వెంకట్, కిట్టు అనే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement