రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

Three Injured In Accident In Maheshwaram - Sakshi

మహేశ్వరం: మూలమలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని గొల్లూరు గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... హైదరాబాద్‌ నింబోలిఅడ్డాకు చెందిన విజయ్‌కుమార్, లాల్‌ దర్వాజాకు చెందిన చలేందర్‌లు మామిడి పండ్ల వ్యాపారం చేస్తున్నారు.

మండల పరిధిలోని మాణిక్యమ్మగూడలో రైతు వద్ద మామిడి తోటను లీజుకు తీసుకొని పండ్లను ఆటోలో నగరానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మంగళవారం మధ్యాహ్నం గొల్లూరు నుండి మాణిక్యమ్మగూడ గ్రామం వెళ్లే  క్రమంలో గొల్లూరు సమీపంలో మూలమలుపు వద్ద ఆటోను అతివేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ విజయ్‌కుమార్, పక్కన కూర్చున్న చలేందర్‌లకు గాయాలయ్యాయి.

విజయ్‌కుమార్‌పై ఆటో ఒరగడంతో ఆటో బాడీకి ఉన్న ఇనుప రాడ్‌ చేతి, వీపులోకి దిగింది. స్థానికులు గమనించి ఆటోకున్న ఇనుపరాడ్‌ను కత్తిరించి గాయాలపాలైన ఇద్దర్నీ శంషాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఆటోను అతివేగంగా మూలమలుపు వద్ద నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌కు ప్రమాదం జరిగిందని ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. 

కంటెయినర్‌ను ఢీకొట్టిన టాటా ఏస్‌

కొత్తూరు: ముందు వెళ్తున్న కంటెయినర్‌ను వెనుక నుంచి వస్తున్న టాటా ఏస్‌ ఆటో ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని తిమ్మాపూర్‌ శివారులో వెంకటేశ్వర హ్యాచరీస్‌ ఎదురుగా జాతీయ రహదారిపై చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రింగ్‌ డబ్బాలతో  తిమ్మాపూర్‌ నుండి కొత్తూరు వైపునకు వెళ్తున్న టాటా ఏస్‌ ఆటో అదే రూట్లో ముందు వెళ్తున్న కంటెయినర్‌ లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ ముజీబ్‌ స్వల్పంగా, క్యాబిన్‌లో ఉన్న మరో వ్యక్తి (కరీముల్లా)తీవ్రంగా గాయపడగా వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. కాగా కరీముల్లా మృతిచెందాడు. వారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top