వాట్సాప్లో కీచులాట
పీణ్య పోలీసులకు మహిళ ఫిర్యాదు
యశవంతపుర (బెంగళూరు): వాట్సాప్ గ్రూప్లో గుడ్నైట్, గుడ్మార్నింగ్ సందేశాలు పెట్టొద్దని చెప్పిన గ్రూప్ అడ్మిన్ మహిళతో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగడంతో పాటు అసభ్యపదజాలంతో ఆడియో పోస్టు చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బెంగళూరు నగరంలోని పీణ్య పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... నాగసంద్రకు చెందిన సామాజిక కార్యకర్త అయిన ఓ మహిళ తనకు పరిచయం ఉన్న రణధీర నాయక నెంబర్ను గ్రూప్లో చేర్చారు. రోజు గ్రూపులో గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ సందేశాలు రావటంతో రణధీరనాయకను ఇటువంటివి పోస్టు చేయద్దని అడ్మిన్గా ఉన్న మహిళ విజ్ఞప్తి చేశారు. దీంతో అతను ఏకంగా మహిళకు ఫోన్ చేసి వాగ్వాదానికి దిగాడు. అంతటితో వదలకుండా రణధీరనాయక్ ఓ ఆడియోను పోస్టు చేశాడు. అందులో మహిళను బెదిరిస్తూ అనుచితంగా మాట్లాడారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రణధీరనాయక్ కోసం గాలింపు చేపట్టారు.