అయ్యో.. ఎంత ఘోరం | Sixth Class Boy Died In Road Accident | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఎంత ఘోరం

Apr 25 2018 11:04 AM | Updated on Aug 30 2018 4:20 PM

Sixth Class Boy Died In Road Accident - Sakshi

అఖిల్‌ తల్లిని ఓదార్చుతున్న డాక్టర్‌ మట్టా దయానంద్‌,పూనెం అఖిల్‌ (ఫైల్‌)

సత్తుపల్లిరూరల్‌: వేసవి సెలవులకు ఇంటికొచ్చి సరదాగా గడుపుదామనుకున్న ఆ బాలుడి ఆనందం అంతలోనే ఆవిరయింది. కొనుగోలు చేసిన నూతన వస్త్రాలు ధరించాలనే కోరిక తీరకుండానే మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే..  సత్తుపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై కొడుకు తల్లి వెళుతుండగా బేతుపల్లి సమీపంలో రోడ్డు దాటే క్రమంలో అతివేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో బాలుడు మృతి చెందగా తల్లికి గాయాలయ్యాయి.

దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన పూనెం అఖిల్‌ (12) తల్లి సులోచనతో కలిసి మంగళవారం సత్తుపల్లిలో నూతన వస్త్రాలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై వెళుతూ బేతుపల్లిలో ఆగారు. అక్కడ  పండ్లు కొనుగోలు చేసి రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి  వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బాలుడు టైర్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. బాలుడి తండ్రి సూర్యనారాయణరావు అశ్వారావుపేట మండలంలో వీఆర్వోగా పని చేస్తున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన కుమారుడు అఖిల్‌ మృత్యువాత పడటంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.  కొత్త దుస్తులు ధరించకుండానే బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లి రోదించింది.

మృతుడు అఖిల్‌ మందలపల్లిలో 6వ తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి జిల్లా దిశ కమిటీ సభ్యుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఐ ఎం.వెంకటనర్సయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement