ఇసుక దందా | Sand irregularities Warangal | Sakshi
Sakshi News home page

ఇసుక దందా

Nov 10 2018 12:42 PM | Updated on Nov 10 2018 12:42 PM

Sand irregularities Warangal - Sakshi

ఎన్నికల సమయం అక్రమార్కులకు కలిసి వస్తోంది. రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది ఎలక్షన్‌ విధుల్లో తలమునకలై ఉండగా.. ఈ పరిస్థితులను ఇసుకాసురులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వర్షాకాలంలో కాస్త తగ్గిన ఇసుక అక్రమ రవాణా ప్రస్తుతం మళ్లీ పెరిగింది. ఇదే అదనుగా నకిలీ నంబర్‌ ప్లేట్లతో ఇసుకను కొల్లగొడుతున్నారు. నెలరోజుల వ్యవధిలో జీరో బిల్లింగ్‌ ద్వారా 10, నకిలీ నంబర్‌ ప్లేట్లతో ఇసుక తరలిస్తున్న 22 లారీలు పట్టుబడడం ఇందుకు నిదర్శనం. 

సాక్షి, కాటారం : మహదేవపూర్, కాటారం మండలంలోని క్వారీల ద్వారా పలువురు లారీల యజమానులు, వ్యాపారులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గతంలో అడపాదడపాగా కొనసాగినమీ దం దా ప్రస్తుతం పెరిగిపోయింది. రోజుకు 5 నుంచి 10 లారీల వరకు వేబిల్లులు లేకుండా, నకిలీ నం బర్ల ప్లేట్లతో ఇసుకను తరలిస్తున్నాయి. ఈ జీరో దందాకు పలు ఇసుక క్వారీల నిర్వాహకులతోపాటు టీఎస్‌ఎండీసీకి చెందిన పలువురు సిబ్బంది, స్థానికులు సహకరిస్తున్నట్లు సమాచారం. కేవలం లారీల ద్వారానే కాకుండా గోదావరి, మానేరు నదుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ఒక చోట డంప్‌ చేసి వే బిల్లులు లేకుండా లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తున్నారు.
 
జీరో దందా ఇలా..
కాటారం మండలంలో 4 ఇసుక రీచ్‌లు, మహదేవపూర్‌ మండలంలో 23 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌ తదితర నగరాలకు ఇసుక రవాణా అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ఇసుక రీచ్‌లలో సుమారు 18కి పైగా వాటిలో జీరో దందా కొనసాగుతున్న ట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు రోజు వారీ ఇసుక వివరాలకు అనుగుణంగా టీఎస్‌ఎండీసీ సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవాలి.

యజ మానులు తీసిన డీడీని సదరు క్వారీల వద్ద ఉండే టీఎస్‌ఎండీసీ సిబ్బంది, క్వారీ నిర్వాహకులు చెక్‌ చేసి ఇసుక లోడింగ్‌కు అనుమతించాలి. అయితే పలు క్వారీల వద్ద ఇలాంటి నిబంధనలు కానరావడం లేదు. టీఎస్‌ఎండీసీ సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి వే బిల్లులు లేకుండానే ఇసుక రవా ణాకు అనుమతిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
 
దాడులతో రూటు మార్చిన అక్రమార్కులు..
ఇటీవల కాలంలో పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో అక్రమ రవాణాదారులు మరో దందాకు తెరలేపారు. నకిలీ నంబర్‌ ప్లేట్లను సృష్టించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నా రు. ఇసుక నిల్వలకు సబంబంధించి టీఎస్‌ఎండీసీ అధికారులు రోజు వారీగా వివరాలను  ఆన్‌లైన్‌ చేయడానికి కొంత సమయం కేటాయిస్తారు. సమయం తక్కువగా ఉండడంతో ఆన్‌లైన్‌ బుకింగ్‌ కష్టతరంగా మారిపోయింది. దీంతో కొందరు ఆన్‌లైన్‌లో ఏదో ఒక లారీ నంబర్‌పై ఇసుక బుకింగ్‌ చేసి మరో లారీకి అమ్ముకుంటున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌చేసిన  నంబర్‌తో డీడీ తీసి లారీ అదే నంబర్‌ ప్లేట్‌ వేసి ఇసుక తరలిస్తున్నారు. ఇలా రోజుకు అనేక లారీలు ఈ ప్రాంతం నుంచి పట్టణాలకు తరలివెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిబ్బంది కనుసన్నల్లోనే అ అక్రమ వ్యాపారం 

  •  యథేచ్ఛగా అక్రమ రవాణా
  •  పొరుగు జిల్లాలో తవ్వకం.. 
  •  మన జిల్లా మీదుగా తరలింపు
  •  అదనపు లోడు.. వేబిల్లులు లేకుండా.. 
  •  ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
  •  పోలీసుల తనిఖీల్లో బయటపడిన వైనం
  •  పట్టించుకోని సంబంధిత అధికారులు

మంగపేట పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలు
భద్రాద్రి జిల్లాలో తవ్వకాలు చేపట్టిన ఇసుకను మన జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. మంగపేట మండలానికి పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వీరాపురం, సాంబాయిగూడెం గోదావరి ఇసుక క్వారీల నుంచి లారీల్లో అధిక లోడుతో హైదరాబాద్, వరంగల్‌ వంటి నగరాల కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విషయం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. రాత్రి సమయాల్లో నిత్యం వందల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా సంబంధిత మినరల్స్‌ అండ్‌ మైనింగ్‌ అధికారులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తొంది. 

రాత్రి.. పగలు..
మంగపేట మండలం మీదుగా రాత్రి.. పగలు తేడా లేకుండా ఇసుక లారీల రద్దీ తీవ్రంగా పెరిగింది. సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారే వరకు రవాణా జరుగుతోంది. రాత్రి సమయంలో రవాణా అయ్యే ఇసుక లారీలకు వే బిల్లులు ఉండడంలేదు. పగటి వేళల్లో అదనపు లోడుతో తరలిస్తున్నారు. విషయం బయటకకు రాకుండా ఉండేందుకు పలు వేబ్రిడ్జీల నిర్వాహకులను మచ్చిక చేసుకుని అదనంగా ఉన్న లోడును తగ్గించి రిసిప్టు తీసుకుంటున్నట్లు సమాచారం. చెక్‌పోస్ట్‌ల్లో అధికారులు తనిఖీలు చేసిన సందర్భంలో రిసిప్టులు చూపించి తప్పించుకుంటున్నారు. అదనపు లోడు ఇసుకను అనువైన ప్రాంతాల్లో డంపు చేసి అమ్ముకుంటున్నట్లు తెలిసింది.
 
లీజు పేరుతో అక్రమ దందా.. 
పేరుకు ఇతర జిల్లాకు చెందిన క్వారీలని చెబుతున్నప్పటికీ మంగపేట మండలం పరిధి కిందకు వచ్చే ప్రాంతంలోని ఇసుకను కొల్లగొడుతున్నారని కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి జిల్లా పినపాక మండలం దుగినేపల్లి పంచాయతీ పరిధిలోని వీరాపురం గిరిజన సొసైటీకి చెందిన ఇసుక క్వారీతోపాటు, మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలోని సాంబా యిగూడెం ఇసుక క్వారీలను హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నట్లు సమాచారం.

వారు రాజకీయ నాయకుల అండతో అక్రమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీల నుంచి అదనపు లోడుతో తరలిస్తున్న వ్యవహారం బయటకు తెలియకుండా ఉండడటానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. క్వారీల వైపు ఎవరుకూడా రాకుండా కొందరిని నిరంతరం కాపాల పెట్టి వారికి నెలనెలా రూ.20 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు ఇసుక క్వారీ ప్రాంతంలోని గోదావరిలో స్నానానికి వెళ్లి సెల్ఫీలు దిగుతుండగా వారి నుంచి సెల్‌ఫోన్‌లు లాక్కుని ఇటువైపు రావద్దని హెచ్చరించినట్లు సమాచారం. కిరాయి మూకల చర్యలతో క్వారీలకు సమీపంలో ఉన్న దుగినేపల్లి, టీకొత్తగూడెం, అకినేపల్లిమల్లారం గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు.

10 లారీలపై కేసు నమోదు
ఇసుక అక్రమ రవాణా వ్యవహారం గతనెల 3వ తేదీ రాత్రి తనిఖీల్లో బయట పడింది. స్థానిక ఎస్సై వెంకటేశ్వర్‌రావు మంగపేట వద్ద ఏటూరునాగారం–బూర్గంపాడ్‌ ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ సమయంలో ఇసుకను తరలిస్తున్న లారీలకు సరైన వే బిల్లులు లేకపోవడాన్ని గమనించారు. అనుమానం వచ్చిన పోలీసులు కమలాపురం వేబ్రిడ్జ్‌కు తరలించి కాంటా వేయిస్తే ఒక్కొ లారీకి 3 నుంచి 5 టన్నుల వరకు అదనపు ఇసుక తరలిస్తున్న విషయం బయటపడింది. దీంతో 10 లారీలపై కేసులు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement