ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Rape Attempt On Women By Youth In Vijayanagaram - Sakshi

సాక్షి, గుర్ల(విజయనగరం) : మూగజీవాలను మేతకు తోలుకెళ్లిన యువతిపై ఇద్దరు కామాంధులు కాటువేశారు. నిర్మానుష్య ప్రదేశాన్ని అనువుగా చేసుకుని అత్యాచారానికి ఒడిగట్టారు. చిత్రహింసలకు గురిచేశారు. తమవద్ద ఉన్న సెల్‌ఫోన్‌లతో యువతి నగ్నచిత్రాలను చిత్రీకరించారు. వాటితోనే వారం రోజులుగా బెదిరిస్తున్నారు. నిలదీసిన కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. పెద్దలు కుదిర్చిన రాజీకి వెరవకుండా వెకిలిచేష్టలకు దిగారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మానవ మృగాలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గుర్ల మండలం దేవునికణపాకలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. 

మండలంలోని దేవుని కణపాకకు చెందిన 21 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బాధిత యువతి,  మరో ఇద్దరు యువకులు ఈ నెల 18న గ్రామ సమీపంలోని గడిగెడ్డ రిజర్వాయర్‌ సమీపంలో ఆవులు, మేకలు మేపుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఇద్దరు యువకులు కొర్నాన ఆనంద్, కొర్నాన నాగరాజు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే సెల్‌ఫోన్‌లో బాధిత యువతి నగ్న చిత్రాలు తీశారు. ఈ విషయాన్ని బాధిత యువతి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.

దీంతో గ్రామపెద్దలు కొంత నగదు ముట్టజెప్పాలని యువకులను ఆదేశించారు. అయితే నిర్ణీత సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితురాలు, కుటుంబ సభ్యులు సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ డి. రమేష్, ఎస్సైతో కలిసి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితురాలికి వైద్యపరీక్షలు చేయిస్తున్నామని.. నివేదిక వచ్చిన తర్వాత కోర్టుకు అందిస్తామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top