వైద్యురాలి నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి! | Sakshi
Sakshi News home page

వైద్యురాలి నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి!

Published Sat, Oct 27 2018 8:23 AM

Pregnant Woman Died In Private Hospital - Sakshi

శ్రీకాకుళం, కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు: కడుపులో బిడ్డతో ప్రసవానికి వచ్చిన ఆ గర్భిణికి మరణమే శరణమైంది. సకాలంలో వైద్యసేవలందకపోవడంతో మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన శుక్రవారం కాశీబుగ్గలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు పంచా యతీ బొర్రాతోట గ్రామానికి చెందిన బొర్రా కామయ్య కుమార్తె  సౌజన్య(28)ను విశాఖకు చెందిన కర్రి రవికుమార్‌తో వివాహం చేశారు. నెలలు నిండటంతో కాన్పు కోసం కొన్ని నెలల కిందట స్వగ్రామం వచ్చింది.  ఈమె   కాశీబుగ్గలోని కావ్యనర్సింగ్‌ హోమ్‌లో నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకుంటోంది.

ప్రసవం సమయం సమీపించడంతో కాన్పు కోసం ఆస్పత్రికి రాగా ఇంకొన్ని రోజులు ఆగాలంటూ వైద్యురాలు స్వరాజ్యలక్ష్మి వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో నాలుగు రోజులు కిందట కడుపులో బిడ్డ కదలికలు లేవని తెలపగా, ఏమీ కాదంటూ పంపించేశారు. తిరిగి రెండు రోజులు క్రితం వచ్చిన ఆమెకు కడుపులో బిడ్డ చనిపోయినట్లు వైద్యురాలు తెలిపింది. ఆపరేషన్‌ చేసి బిడ్డ మృతదేహాన్ని తొలగించాలని కోరినా స్పందించలేదు. చివరకు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో శుక్రవారం సాయంత్రం ఆపరేషన్‌ చేస్తుండగా పరి స్థితి విషమించి సౌజన్య మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహోద్రక్తులయ్యారు. వైద్యుల తీరును నిరసిస్తూ బంధువులతో కలిసి  నర్సింగ్‌ హోమ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. గతంలో పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన గర్భిణికి కూడా ఇదే మాదిరిగా కడుపులో బిడ్డ మరణించడం గమనార్హం. 

సమయమే లేదట..
కాశీబుగ్గ కావ్యనర్సింగ్‌ హోం వైద్యులు డాక్టర్‌ కణితి కేశవరావు, స్వరాజ్యలక్ష్మిలు గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేవారు. తర్వాత కాశీబుగ్గలో ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించి సొంతంగా మందులు దుకాణం పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. తర్వాత అధికార పార్టీ నేతల పలుకుబడితో స్వరాజ్యలక్ష్మి తిరిగి పలాస సామాజిక ఆస్పత్రిలో చేరి ప్రసూతి వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. 

Advertisement
Advertisement