పుట్టినరోజు నాడే గ్యాంగ్రేప్
కోయంబత్తూర్లో టీనేజర్పై అకృత్యం
కోయంబత్తూర్: పుట్టిన రోజును జరుపుకోవడానికి మిత్రుడితో కలసి పార్కుకు వెళ్లిన టీనేజర్పై దారుణం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటలకు తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఆరుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూర్ జిల్లా సీరనాయకన్పలాయమ్ గ్రామంలో గత నెల 26న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇంటర్ తొలిఏడాది చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన పుట్టినరోజును మిత్రుడితో కలసి జరుపుకున్న తర్వాత పార్కు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఆరుమంది మృగాళ్లు వారిని అడ్డగించారు.
బాలిక వెంట వచ్చిన మిత్రుడిని చితకబాదుతూ, బట్టలు విప్పించి పారిపోయేలా చేశారు. అనంతరం బాలికను బట్టలు విప్పాల్సిందిగా బలవంతం చేశారు. బాలిక అందుకు నిరాకరించడంతో కింద పడవేసి బలవంతం చేశారు. అప్పుడు కూడా ఆమె తిరస్కరించడంతో ఇద్దరు కలసి అత్యాచారం చేశారు. మరో నలుగురు ఈ తతంగాన్ని వీడియో తీశారు. తర్వాత బాలిక అక్కడి నుంచి తప్పించుకొని, తన బంధువు ఇంటికి చేరుకొని 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న రాహుల్, ప్రకాశ్, కార్తికేయన్, నారాయణమూర్తిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితోపాటు మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా 22 నుంచి 25 ఏళ్ల లోపు వారే. వీరిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మరిన్ని వార్తలు