వివాహిత దారుణ హత్య

Married Woman Suspicious Death in YSR Kadapa - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా, ఒంటిమిట్ట : మండల పరిధిలోని చింతరాజుపల్లె పంచాయతీ చేనువారుపల్లె గ్రామం, ఎస్సీకాలనీకి చెందిన వివాహిత దారా లక్ష్మిదేవి(48 దారుణ శనివారం హత్యకు గురై, ఊరిలోని పాడుబడిన గొల్లోల్ల బావిలో శవమై కనిపించిన విషయం విదితమే. హత్య జరిగిన స్థలానికి పోలీసులు చేరుకునే సరికి చీకటి పడటంతో మృతురాలి దేహాన్ని బావిలోనే ఉంచి పహారా కాసి, ఆదివారం రాజంపేట డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, ఒంటిమిట్ట సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ అశ్విని ఆధ్వర్యంలో క్లూస్‌ టీమ్‌ని రప్పించి అనవాలను పరిశీలించారు. సీఐ హనుమంతనాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్న ఆమె చరవాణిలో మాట్లాడుతూ నివాసం నుంచి బయటకు వెళ్లిందని, ఆ తరువాత తిరిగి రాకపోవడంతో కుంటుబ సభ్యులు ఊరిలో, సమీప పంటపొలాల్లో వెతికినా ఆమె జాడ కనిపించలేదన్నారు. చివరికి వారి ఇంటి సమీపంలో ఉన్న పాడుబడిన బావిలో లక్ష్మిదేవి మృతదేహాన్ని గుర్తించారు.

విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశామన్నారు. విచారణలో లక్ష్మిదేవి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మిదేవికి 20 ఏళ్ల కిందట సిద్దవటం మండలం జంగాలపల్లెకు చెందిన రామకృష్ణతో వివాహమై, ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు. భర్తతో మనస్పర్థలు రావడంతో గత కొంత కాలంగా  పుట్టింట్లోనే ఉండి, జీవనోపాధి కోసం గతంలో కువైట్‌కు వెళ్లి, కొన్ని నెలల కిందట ఆమె సొంతూరుకు చేరుకుంది. ఇంటి వద్దనే చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేదని, ఈ క్రమంలో ఆమెతో  సమీప బంధువైన దారా వెంకటేష్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె 6 నెలల నుంచి మాట్లాడటం లేదని, ఎవరితోనో చరవాణిలో మాట్లాడుతూ తనను పట్టించుకోలేదనే అనుమానంతో గొడవ పడుతూ ఉండేవారని, ఈ క్రమంలో పథకం ప్రకారం ఫోన్‌ చేసి పిలిపించుకుని పదునైన రాళ్లతో కొట్టి, ఆయుధంతో గొంతు కోసి చంపి పరారైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.   

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top