‘సీఎంను చంపేస్తా’.. కత్తితో హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని కేరళ భవన్ వద్ద శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. కత్తితో భవన్ ఆవరణలోకి చొరబడ్డ ఓ వ్యక్తి.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపేస్తానంటూ హల్ చల్ చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. విమల్ రాజ్(46) అనే వ్యక్తి ఈ ఉదయం చేతిలో కొన్ని పేపర్లు.. జేబులో జాతీయ జెండా, కత్తితో కన్నౌట్ ప్లేస్(ఢిల్లీ)లోని కేరళ భవన్ వద్దకు చేరుకున్నాడు. మెయిన్ గేట్ సెక్యూరిటీ కళ్లు గప్పి ఎలాగోలా లోపలికి ప్రవేశించాడు. అయితే ఆవరణలోని అధికారులు అతన్ని అడ్డుకునే సరికి లోపలికి అనుమతించాలంటూ వారితో వాగ్వాదానికి దిగాడు.
నెలరోజులుగా ఓ కేసు నిమిత్తం తాను సీఎంను కలిసేందుకు యత్నిస్తున్నానని, కానీ, ఆ పని జరగట్లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతలో అధికారులు అతన్ని వెనకాల నుంచి వెళ్లి చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కొడవూర్, కరిపుజ్జాకు చెందిన విమల్కు మతిస్థిమితం సరిగ్గాలేదని, అతని చేతిలో ఉన్న పేపర్లు అతని మెడికల్ రిపోర్ట్లేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతన్ని చికిత్స కోసం ఐబీహెచ్ఏఎస్కు తరలించారు. ఇదిలా ఉంటే ఘటన జరిగిన సమయంలో సీఎం విజయన్ లోపలే ఉన్నారు.