విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
భువనగిరి క్రైం : ఇంట్లో విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన భువనగిరి మండలం లోని బీఎన్.తిమ్మాపురం గ్రామంలో బుధవారం జరిగింది. భువనగిరిరూరల్ ఇన్చార్జ్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉడుత సత్యనారాయణ(45) తన ఇంట్లో ప్లాస్టింగ్ వర్క్ చేయిస్తున్నాడు. '
బయట ఉన్న ప్రహరీకి నీరు పడదామని మోటార్ కనెక్షన్ ఇస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. దీంతో సత్యనారాయణ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.