స్నానానికి వెళ్లి శవమై తేలాడు! | Man Deceased in Canal Dichpalli Nizamabad | Sakshi
Sakshi News home page

స్నానానికి వెళ్లి శవమై తేలాడు!

Jun 3 2020 1:14 PM | Updated on Jun 3 2020 1:14 PM

Man Deceased in Canal Dichpalli Nizamabad - Sakshi

సంఘటన స్థలం వద్ద గుమిగూడిన స్థానికులు

నిజామాబాద్‌, డిచ్‌పల్లి: విందుకు వెళ్లిన మిత్రులు సరదాగా స్నానం చేసేందుకు వెళ్లగా, ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. డిచ్‌పల్లి తహసీల్దార్‌ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్‌ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్‌ మండలం బోర్గం (పీ) గ్రామానికి చెందిన గౌర వుల రమేశ్‌ (24), తన స్నేహితుడు శ్రీనాథ్‌తో కలిసి సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇద్దరు కలిసి బైక్‌పై డిచ్‌పల్లి మండలం యానంపల్లి శివారులో గల రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ వద్దకు చేరుకుని సాయంత్రం వరకూ విందు చేసుకున్నారు. అనంతరం కాలువలో స్నానం చేయడానికి దిగిన రమేశ్‌ నీటిలో మునిగి చనిపోయాడు. రాత్రి పది దాటినా రమేశ్‌ ఇంటికి రాక పోవడంతో ఆయన భార్య సంధ్య కంగారు పడింది.

అతడి ఫోన్‌ చేయగా స్నేహితుడు శ్రీనాథ్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు. రమేశ్‌ గురించి అడుగగా సరైన సమాధానం చెప్పకుండానే పెట్టేశాడు. అయితే, మరో స్నేహితుడు మంగళవారం ఉదయం సంధ్యకు ఫోన్‌ చేసి, రమేశ్‌ కాలువలో స్నానం చేస్తుండగా నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపాడు. వెంటనే మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చి, ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్‌ వేణుగో పాల్‌ సైతం కాలువ వద్దకు చేరుకున్నారు. కాలువ లోతుగా ఉండటంతో ఎస్సై సురేశ్‌కుమార్‌ జాలర్లను రంగంలోకి దించారు. చేపల వల సహాయంతో సుమారు 3 గంటల పాటు గాలించి చివరకు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement