‘ఇళ్ల పట్టాల’ కేసులో మరో నిందితుడి అరెస్టు

Man Arrested In Cheating Case - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల పట్టాలు, రాజీవ్‌ స్వగృహలో ఫ్లాట్‌లు ఇప్పిస్తామని 120 మంది సభ్యుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి మోసగించిన ఖాజా ఘయాసుద్దీన్‌ను నగర సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 12న ప్రధాన నిందితుడు మసూద్‌ అహ్మద్‌ను జైలుకు తరలించిన పోలీసులు మరో నిందితుడైన ఖాజా ఘయాసుద్దీన్‌ పట్టుకొని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం.. సరూర్‌నగర్‌ మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములకు పట్టాలు, లక్ష్మీగూడలోని రాజీవ్‌ స్వగృహలో ఇళ్లు ఇప్పిస్తామని 120 మంది నుంచి రూ.1.80 కోట్లను ఖాజా ఘయాసుద్దీన్‌ మరికొందరితో కలిసి వసూలు చేశాడు. దీనిని నమ్మించేందుకు ఏకంగా బాలాపూర్‌ తహసీల్దార్‌ స్టాంప్‌లు, సంతకాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు, తెలంగాణ హౌసింగ్‌ బోర్డు లేఖలు తయారుచేసి జిరాక్స్‌ కాపీలు ఇచ్చారు. దీనిపై గతేడాది అక్టోబర్‌ ఐదున ఫిర్యాదు చేసిన మసూద్‌ అహ్మద్‌ ఆ తర్వాత నిందితులతో వకాల్తా పుచ్చుకొని నేరగాడిగా మారాడు. ఇలా మోసం చేసిన నిందితులను విడతల వారీగా సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top