జేసీ వర్గీయుల రౌడీయిజం
వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేతపై హత్యాయత్నం
ఇళ్లు, ఫ్యాక్టరీలపై రాళ్ల దాడి
పట్టించుకోని పోలీసులు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయలు బీభత్సం సృష్టించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వీధి రౌడిల్లా రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్ బాషా అలియాస్ మున్నాపై హత్యయత్నానికి పాల్పడ్డారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర కలకలం రేగింది.
ఇటీవల టీడీపీ కార్యకర్తల చేతిలో గాయపడ్డ తన అనుచరున్ని ఆసుపత్రిలో పరామర్శించి ఇంటికి వెళ్తున్న మున్నాపై కాపుకాసి దాడి చేశారు. ఆయన ప్రాణాలతో తప్పించుకోవటంతో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు తన ఇళ్లు, ఫ్యాక్టరీపై రాళ్లతో దాడి చేశారు. వీటికి సంబంధించిన సీసీకెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత జరిగినా పోలీసులు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.