అనుమానంతో భార్యను నరికిన భర్త | Husbend Killed Wife With Suspected | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను నరికిన భర్త

Dec 2 2017 7:19 AM | Updated on Nov 6 2018 8:50 PM

Husbend Killed Wife With Suspected - Sakshi

ఎమ్మిగనూరు రూరల్‌: పట్టణంలోని కబరస్తాన్‌ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలి తండ్రి ఉసేని తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన బాషా, పర్వీన్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు పర్వీన్‌ మూడు నెలల గర్భిణి. బాషా తన భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం వేధిస్తుండేవాడు. కుటుంబ సభ్యులు నచ్చజెబుతూ వచ్చారు. కొంతకాలం క్రితం బాషా తన భార్యను బెంగళూరులో ఉండే సోదరుడి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవించేవారు. అక్కడ కూడా గొడవ పడుతుండటంతో బాషాను అతని  సోదరుడు తిట్టి పంపాడు.

అయితే..అతను ఎమ్మిగనూరుకు రాకుండా 20 రోజుల క్రితం కేరళకు తీసుకెళ్లాడు. కేరళలో నడిరోడ్డుపై భార్యతో గొడవ పడి.. చంపటానికి ప్రయత్నించటంతో అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు తెలుసుకొని పర్వీన్‌ తండ్రికి సమాచారమిచ్చారు. అతను కేరళకు వెళ్లి కుమార్తెను ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు. బాషా నాలుగు రోజుల క్రితం మళ్లీ భార్య దగ్గరకు రావటంతో మామ, కుటుంబ సభ్యులు సర్దిచెప్పారు. అయితే.. శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యపై గొడ్డలితో తలపై నరికాడు. శబ్దం రావటంతో çపర్వీన్‌ తండ్రి వచ్చి చూడగా.. గొడ్డలితో నరుకుతుండటం గమనించి కేకలు వేశాడు. దీంతో  బాషా పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న కుమార్తెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రెఫర్‌ చేశారు. కేసు నమోదు చేసినట్లు  పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement