అనుమానంతో హతమార్చాడు | Sakshi
Sakshi News home page

అనుమానంతో హతమార్చాడు

Published Tue, Mar 12 2019 1:43 PM

Husband Killed His Wife With Suspect On Her In Jyothinagar - Sakshi

సాక్షి, జ్యోతినగర్‌(రామగుండం): మూడు ముళ్లు..ఏడడుగులు వేసి కడదాకా తోడుంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన ఓ భర్త..అనుమానంతో కట్టుకున్న భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూ పీకే రామయ్యకాలనీలో లావుడ్య రాములు ఆటో నడుపుకుంటూ భార్య రమాదేవి(30), కూతురు అనూషతో కలిసి జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆమెను అనుమానిస్తూ శారీరకంగా హింసకు గురి చేస్తున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈక్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాములు భార్యతో గొడవపడి ఇంట్లో ఉన్న ఇనుపరాడ్‌తో తలపై కొట్టి గాయపరిచాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడటంతో పక్కనున్నవారు వచ్చి చూడగా గాయపడి ఉంది. దీంతో రాములు అక్క గాయపడిన రమాదేవి తలకు గుడ్డ ముక్కను అదిమిపట్టి గోదావరిఖనిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి సోదరుడు దేదావత్‌ లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని రామగుండం సీఐ స్వామి, ఎస్సై సందర్శించి విచారణ చేపట్టారు.  

Advertisement
Advertisement