మృత్యువులోనూ వీడని బంధం

Husband And Wife Killed In Road Accident In Orissa - Sakshi

కంచిలి: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. శుభకార్యం నిమిత్తం ద్విచక్ర వాహనంపై బరంపురం వెళ్తుండగా అతివేగంతో లారీ ఢీకొట్టడంతో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. కంచిలి మండలంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై ‘ఆదివారం సంత’ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోంపేట పట్టణంలోని టౌన్‌హాల్‌ వీధికి సప్తగిరి స్టీల్స్‌ యజమాని వైశ్యరాజు వెంకటరమణ అలియాస్‌ కన్నా (54) ప్రతి 15 రోజులకోసారి వ్యాపార లావాదేవీల్లో భాగంగా బరంపురం వెళ్తుంటారు. ఈయన అత్తవారు కూడా బరంపురం సమీపంలోనే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తన తోడల్లుడి కుమారుడు వివాహ నిశ్చితార్థం ఉండడం, శనివారం రిపబ్లిక్‌ డే, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో భార్య శ్రీలత(48)తో కలిసి బరంపురం వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా బరంపురం వెళ్లిన ఒక్కరోజే తిరిగి ఇంటికి రావడంతో ఈసారి మూడు రోజుల పాటు బంధువులతో కలిసి సంతోషంగా గడుపుదామని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం బైకుపై బయలుదేరారు. మకరాంపురం కూడలిలోని ‘ఆదివారం సంత’ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. భార్యాభర్తల మీదుగా లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. ప్రమాద స్థలానికి దూరంగా బైకు ఎగిరిపడి నుజ్జునుజ్జయ్యింది. లారీ సైతం కొద్దిదూరం వెళ్లి బోల్తాపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ ఎం.హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top