హైదరాబాద్: నగరంలోని ఓ మహిళా వ్యాపారిని రాజస్తాన్ వాసి నమ్మించి మోసం చేసి సుమారు రూ.1.80 కోట్ల విలువ చేసే 450 కిలోల వెండి ఆభరణాలతో పరారయ్యాడు. హైదరాబాద్ యూసుఫ్గూడ సమీపంలోని శ్రీ కృష్ణనగర్లో మహిళా వ్యాపారి ధర్మిష్ట జైన్ (34) మూడేళ్లుగా శ్రీ నకోడా సిల్వర్ పేరుతో వెండి ఆభరణాల షాప్ నడుపుతున్నారు. బులియన్ మార్కెట్లో కొన్న వెండి బిస్కెట్లతో ఆభరణాలు తయారు చేసి క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేస్తున్నారు.
ఆమెకు రాజస్తాన్లోని నర్పత్ పట్టణానికి చెందిన జాలారామ్ అలియాస్ బాగ్దారామ్ అలియాస్ భరత్ ఆభరణాల వ్యాపారిగా పరిచయమయ్యాడు. తనకు వెండి ఆభరణాలు ఇస్తే వాటిని విక్రయించి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తానని నమ్మించి 10 నెలలుగా ఆమెతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. జూన్లో 450 కిలోల వెండి ఆభరణాలు కావాలని.. వాటిని అమ్మి డబ్బులు చెల్లిస్తానంటూ ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆభరణాలు తీసుకున్న తర్వాత డబ్బులు చెల్లించకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
450 కిలోల వెండి ఆభరణాలతో పరార్
Jan 17 2018 3:57 AM | Updated on Aug 21 2018 6:02 PM
Advertisement
Advertisement