పనిమనిషిని చంపి.. అడ్డంగా బుక్కయ్యాడు!

Chandigarh Man Killed Labourer Burns Body For Insurance - Sakshi

సిమ్లా : ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఆశపడి పనిమనిషిని చంపి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. తన పథకం పారకపోవడంతో పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. పోలీసుల వివరాలు... చండీగఢ్‌కు చెందిన ఆకాశ్‌ వద్ద రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి పనిచేసేవాడు. అయితే గత కొంతకాలంగా ఆకాశ్‌ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న బీమా డబ్బులు వస్తే ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చని భావించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పథకం రచించాడు.

తాను చనిపోయినట్లుగా నటించి..
గత నెలలో తమ ఇంటి పనివాడిని చంపిన ఆకాశ్‌ అతడి మృతదేహాన్ని తన కారులో హిమాచల్‌ ప్రదేశ్‌లోని నహన్‌ పట్టణానికి తరలించాడు. ఆ తర్వాత కారుకు నిప్పంటించాడు. తన ఆచూకీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో నేపాల్‌ పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా కారు ప్రమాదంలో ఆకాశ్‌ మరణించాడంటూ అతడి మేనల్లుడు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఆకాశ్‌ చనిపోయాడనే వార్త తెలిసిన మరుసటి రోజు నుంచే అతడి మరణ ధ్రువీకరణపత్రం కావాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. దీంతో ఆకాశ్‌ను పల్వాల్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top