అదృశ్యమైన విద్యార్థి.. శవమయ్యాడు

Boy Suspocious Dead Body Found In Nyalkal Well - Sakshi

సాక్షి, న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): అదృశ్యమైన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని మిర్జాపూర్‌(బి)లో చోటు చేసుకుంది. హద్నూర్‌ ఎస్సై బాలస్వామి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు కుమారుడు శ్రీనివాస్‌ (20)జహీరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ నెల 4న (సోమవారం) సెలవురోజు కావడంతో కళాశాలకు వెళ్లలేదు. ఉదయం ఇంటి వద్దే ఉన్న శ్రీనివాస్‌ మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువులు, మిత్రులు దగ్గర వెతినా ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్‌ తండ్రి రాములు 5న హద్నూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామానికి చెందిన అంబిక వ్యవసాయ పొలం వద్ద బావిలో అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఉదయం అదే గ్రామానికి చెందిన ఆనంద్‌ పొలానికి వెళ్లగా బావిలో శ్రీనివాస్‌ శవమై కనిపించాడు. ఈ విషయాన్ని ఆనంద్‌ మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న హద్నూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బావిలోంచి శ్రీనివాస్‌ మృతదేహన్ని వెలికి తీసి పంచనామ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి శ్రీనివాస్‌ మృతికి ప్రేమ వ్యవహరమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై బాలస్వామి వెల్లడించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top