మూత్రం పోశాడని దాడి.. మృతి | Attack on Man While Open Toilet in Jukkal Nizamabad | Sakshi
Sakshi News home page

మూత్రం పోశాడని ఒకరిపై దాడి

Jan 14 2020 12:50 PM | Updated on Jan 14 2020 12:50 PM

Attack on Man While Open Toilet in Jukkal Nizamabad - Sakshi

జుక్కల్‌లో దుకాణం వద్ద బైఠాయించిన సావర్‌గావ్‌ తండా ప్రజలు,గణపతి(ఫైల్‌)

నిజాంసాగర్‌(జుక్కల్‌): బహిరంగ మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తిపై దుకాణదారుడు దాడి చేశాడు. దీంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. జుక్కల్‌ మండల కేంద్రంలో నాల్గు రోజుల కింద జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జుక్కల్‌ మండలం సావర్‌గావ్‌ తండాకు చెందిన ఫవర్‌ గణపతి(48) అనే వ్యక్తి గురువారం వారాంతపు సంతకు వచ్చాడు. సంతలో కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్లడానికి జుక్కల్‌ బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆటోలు, జీపులు లేక గంటపాటు బస్టాండ్‌ పరిసరాల్లో నిరీక్షించారు. అదే సమయంలో గణపతికి మూత్రం రావడంతో రోడ్డు పక్కనే ఉన్న దుకాణ సముదాయాల ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. దుకాణం పక్కన మూత్ర విసర్జన చేస్తావంటూ గోపాల్‌ సేట్‌ సదరు వ్యక్తిపై దాడి చేశాడు.

బలంగా దాడి చేయడంతో గణపతి దుకాణ గోడకు తగిలి కింద కుప్పకూలాడు. స్థానికులు గమనించి గణపతిని చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ గణపతి మృతిచెందాడు. గణపతి కుటుంబీకులతో కలిసి సావర్‌గావ్‌తండా ప్రజలు గోపాల్‌ సేట్‌ మెడికల్‌ వద్ద బైఠాయించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనతో అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ హామీతో సమస్య జఠి లం కాకుండా సద్దు మణిగింది. మృతుడికి భా ర్య, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జుక్కల్‌ ఎస్‌ఐ రఫీయోద్దిన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement