వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం

Assassination attempt on YSRCP activist in Ponnur - Sakshi

గుంటూరు జిల్లా పొన్నూరులో ఘటన

పొన్నూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీకి చెందిన వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన సూర బ్రహ్మయ్యపై ఏడో వార్డుకు చెందిన బాణాల దుర్గారావు కత్తితో దాడిచేశాడు. కత్తి కడుపులో బలంగా దిగటంతో తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్యను స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బ్రహ్మయ్య టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చాడు.

ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు చాలా మందిని తనతో పాటు పార్టీలోకి తీసుకురావటంతో బ్రహ్మయ్యతో దుర్గారావు గొడవ పడ్డాడు. సోమవారం రాత్రి తన ఇంటి వద్ద దుర్గారావు, మరో వ్యక్తి ఘర్షణ పడుతుండగా వారికి బ్రహ్మయ్య సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన దుర్గారావు ఇంటికి వెళ్లి కత్తి తెచ్చి బ్రహ్మయ్యపై దాడి చేశాడు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే దుర్గారావు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బాధితుడు, అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top