ఒక్కగానొక్క కూతురికి కరెంట్‌ షాకిచ్చి..

 UP woman killed for honour  - Sakshi

యూపీలో మరో పరువు హత్య

ఫిరోజాబాద్ (ఉత్తర ప్రదేశ్) :  పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫిరోజాబాద్‌కు చెందిన పూజ (22) యువతి కన్నతండ్రి చేతిలో పరువు హత్యకు గురైంది. పక్కింటి యువకుడిని ప్రేమిస్తుందన్న కారణంతో  ఏకైక కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.  పరువు హత్యలకు సంబంధించి గత 18 నెలల్లో 23వ కేసుగా భావిస్తున్న ఈ ఘటన ఫిరోజాబాద్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.

జస్రానా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) గిరీష్ చంద్ర గౌతమ్ సమాచారం ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన పూజా ఐదుగురు తోబుట్టువులలో చిన్నది,  ఏకైక కుమార్తె.  తమ కులానికే చెందినవాడు, పక్కింటి యువకుడు  గజేంద్రను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తోంది.  ఈ వ్యవహారాన్ని తండ్రి అంగీకరించలేకపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పూజ, గజేంద్రతో మాట్లాడటం చూసిన తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరింత రెచ్చిపోయి ఆమె పట్టుకుని, మొదట కరెంట్‌షాకిచ్చాడు. అనంతరం కత్తితో గొంతుకోసి హతమార్చాడు. విచారణలో నిందితుడు, పూజ తండ్రి హరివంశ్‌ కుమార్‌  నేరాన్ని అంగీకరించాడని  పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలు సోదరుడు యోగేశ్‌  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top