
సాక్షి, చిత్తూరు : సహకార చక్కెర ఫ్యాక్టరీలపై ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఎండగట్టారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయన గురువారం ఇక్కడ మాట్లాడుతూ...‘ చెరుకు రైతుల కష్టాలు చూస్తుంటే బాధ కలుగుతోంది. బెల్లం తయారీపై అనవసర ఆంక్షలు వెనక ప్రభుత్వ పెద్దల స్వార్థం కనిపిస్తోంది. ప్రభుత్వ అనవసర ఆంక్షలతో రైతుల జీవితాలు ప్రయివేట్ ఫ్యాక్టరీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డాయి. కాపాడాల్సిన ప్రభుత్వమే రైతు వ్యతిరేక చర్యలకు దిగడం సిగ్గుచేటు?’ అని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను ఆలకించిన వైఎస్ జగన్.. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక చెరకు రైతులకు అన్నివిధాల అండగా ఉంటామని భరోసా యిచ్చారు.
అంతకు ముందు జూనియర్ లెక్చరర్స్ ఇవాళ ఉదయం వెదురుకుప్పం గ్రామంలో వైఎస్ జగన్ను కలిశారు. 2000 సంవత్సరం నుంచి తాము కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్నామని, ఇప్పటివరకూ తమను రెగ్యులరైజేషన్ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారికి హామీ యిచ్చారు.