వాటాదారుల ప్రయోజనాలకు పూర్తి భద్రత 

Vedanta clarification on investment in Anglo American - Sakshi

ఆంగ్లో అమెరికన్‌లో పెట్టుబడులపై వేదాంత స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఆంగ్లో అమెరికన్‌ పీఎల్‌సీలో తన విదేశీ సంస్థ కెయిర్న్‌ ఇండియా హోల్డింగ్స్‌ చేసిన పెట్టుబడి పరిపాలనా అనుమతులకు లోబడే ఉన్నాయని, ఇది వాటాదారుల ప్రయోజనాలను కాపాడుతుందని వేదాంత లిమిటెడ్‌ వివరణ ఇచ్చింది. వేదాంత షేర్లు గత శుక్రవారం 20 శాతం వరకు నష్టపోయిన నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. ‘‘ఈ పెట్టుబడి ఇప్పుడు పూర్తి మూలధనంగా ఉంది. డౌన్‌సైడ్‌ రక్షణతోపాటు వేదాంత వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణకు భరోసానిస్తుంది’’ అని వేదాంత లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన వివరణలో తెలియజేసింది. ఆంగ్లో అమెరికన్‌ కంపెనీలో ఉన్న వృద్ధి అవకాశాల నేపథ్యంలో కెయిర్న్‌ ఇండియా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ వద్ద ఉన్న మిగులు నిల్వల నుంచి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసేందుకు వోల్కన్‌ ఆఫర్‌ చేసినట్టు తెలిపింది.

ఇతర విదేశీ నగదు నిర్వహణ పెట్టుబడులతో పోలిస్తే దీనిపై అధిక రాబడులు వస్తాయని, సాధారణంగా 2% రాబడులొస్తాయని పేర్కొంది. రిస్క్‌ ఆధారిత రాబడుల అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదటే తన నగదు నిల్వల నుంచి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓటింగ్‌ హక్కులు మాత్రం వోల్కన్‌ వద్దే ఉంటాయని స్పష్టం చేసింది. స్వతంత్ర వాల్యూయర్‌ చేసిన మదింపు అనంతరం, కెయిర్న్‌ ఇండియా హోల్డింగ్స్, వేదాంత లిమిటెడ్‌ బోర్డుల ఆమోదం అనంతరమే ఇన్వెస్ట్‌ చేసినట్టు వివరణ ఇచ్చింది. డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాల్లో ఈ విషయాన్ని స్వచ్చందంగానే వెల్లడించినట్టు తెలిపింది. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top