షేర్లను అమ్ముకున్న జీ ప్రమోటర్లు | Shares Selling Jeep promoters | Sakshi
Sakshi News home page

షేర్లను అమ్ముకున్న జీ ప్రమోటర్లు

Feb 5 2019 4:19 AM | Updated on Feb 5 2019 4:19 AM

Shares Selling Jeep promoters - Sakshi

న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జీ గ్రూపు ప్రమోటర్లు ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో తమ వాటాల నుంచి కొంత మేర ఓపెన్‌ మార్కెట్లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. జవనరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. తద్వారా రూ.1050 కోట్లను ప్రమోటర్లు సమకూర్చుకున్నారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్, డిష్‌టీవీ, జీ మీడియా కార్పొరేషన్, సిటీ నెట్‌వర్క్స్, జీ లెర్న్‌ కంపెనీల్లో వాటాలను అమ్మేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల రంగంలో చేసిన వ్యాపారాలు బెడిసి కొట్టాయని, భారీ రుణ భారాన్ని తీర్చడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు జీ ప్రమోటర్‌ సుభాష్‌చంద్ర గత నెల 26న ప్రకటించడం గమనార్హం. 

అమ్మకాలు వీటిల్లోనే...
►జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల సంస్థలు అయిన... సైక్వేటర్‌ మీడియా సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 1.69 శాతం, ఎస్సెల్‌ కార్పొరేట్‌ ఎల్‌ఎల్‌పీ 0.85 శాతం మేర షేర్లను అమ్మేశాయి.  ఈవాటాల విక్రయం ద్వారానే ప్రమోటర్లకు రూ.874.11 కోట్లు సమకూరాయి.

►డిష్‌ టీవీలో వరల్డ్‌ క్రెస్ట్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ 0.86 శాతం, డైరెక్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ వెంచర్స్‌ 0.80 శాతం, వీనా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 0.35 శాతం చొప్పున రూ.97.34 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. 

►జీ మీడియా కార్పొరేషన్‌లో ఏఆర్‌ఎం ఇన్‌ఫ్రా అండ్‌ యుటిలిటీస్‌ 2.38 శాతం, 25ఎఫ్‌పీఎస్‌ మీడియా 3.09 శాతం మేర షేర్లను అమ్మేశాయి. 

►సిటీ నెట్‌వర్క్స్‌లో ఆరో మీడియా అండ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 4.50 శాతం వాటాను విక్రయించింది. దీని విలువ రూ.28.88 కోట్లుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement