
బకాయిల వసూళ్ల పరిస్థితి ఏంటి..?
బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ రికవరీ వివరాలను అందించాలని మంగళవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్రానికి సుప్రీం ప్రశ్న
♦ బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల రికవరీ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ రికవరీ వివరాలను అందించాలని మంగళవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) అప్పిలేట్ ట్రిబ్యునల్స్లో పెండింగులో ఉన్న రికవరీ కేసుల వివరాలనూ తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి గడచిన పదేళ్ల సమాచారాన్నీ న్యాయస్థానం ముందు ఉంచాలని నిర్దేశించింది.
తగిన యంత్రాంగం ఉందా?
చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేస్తూ, రుణ రికవరీ విషయంలో ఆయా ట్రిబ్యునల్స్కు తగిన మౌలిక వసతులు ఉన్నాయా? చట్ట ప్రకారం, నిర్దేశిత సమయాల్లో రుణ రికవరీ జరుగుతోందా? వంటి అంశాలకు సైతం సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. డీఆర్టీలు, డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్స్లో రుణ రికవరీకి యంత్రాంగం తగిన స్థాయిలో లేకపోవడం వల్ల లక్షల కోట్ల రూపాయల మేర మొండిబకాయిలు పెరిగిపోతున్నాయని సైతం బెంచ్ పేర్కొంది. ‘‘ఎన్పీఏలు లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోతున్నాయి. డీఆర్టీలు, సంబంధిత అప్పిలేట్ ట్రిబ్యునల్స్లో తగిన యంత్రాంగం లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.
పిల్పై ఉత్తర్వు రిజర్వ్..: మొండిబకాయిలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పీఐఎల్)పై ఉత్తర్వులను అంతక్రితం కోర్టు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ను 2003లో సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(సీపీఐఎల్) అనే సంస్థ దాఖలు చేసింది. ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) ద్వారా కొన్ని కంపెనీలకు రుణాలు ఇవ్వడాన్ని ఈ పిల్ ప్రశ్నించింది. 2015లో రూ.40వేల కోట్ల కార్పొరేట్ రుణాన్ని అకౌంట్ల నుంచి తొలగించిన విషయాన్నీ తాజాగా కోర్టు ముందుకు సీపీఐఎల్ తీసుకువచ్చింది.