రూపీ భారీ రికవరీ : మార్కెట్లు హైజంప్‌ | Rupee Sharp Recovery Helps Sensex End 300 Pts Higher | Sakshi
Sakshi News home page

రూపీ భారీ రికవరీ : మార్కెట్లు హైజంప్‌

Sep 12 2018 4:07 PM | Updated on Nov 9 2018 5:34 PM

Rupee Sharp Recovery Helps Sensex End 300 Pts Higher - Sakshi

మార్కెట్లు హైజంప్‌ (ప్రతీకాత్మక చిత్రం)

ముంబై : అత్యంత కనిష్ట స్థాయిల్లోకి పడిపోతూ.. రోజురోజుకు క్షీణిస్తున్న రూపాయి మారకం ఒక్కసారిగా పెద్ద ఎత్తున రికవరీ అయింది. రూపాయి భారీగా కోలుకోవడం, స్టాక్‌ మార్కెట్లను హైజంప్‌ చేయించింది. రూపాయి దెబ్బకు గత రెండు రోజుల నుంచి భారీగా పతనమవుతున్న సెన్సెక్స్‌ ఒక్కసారిగా త్రిపుల్‌ సెంచరీని బీట్‌ చేసింది. నిఫ్టీ సైతం 11,350 మార్కుకు పైకి ఎగిసింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 305 పాయింట్ల లాభంలో 37,717 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంలో 11,369 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌, మెటల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ సైతం పైకి ఎగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ , ఐటీసీ వంటి కంపెనీల ర్యాలీ మార్కెట్లకు బాగా సహకరించింది. 

పవర్‌ గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ టాప్‌ గెయినర్లుగా నిలువగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ ఎక్కువగా నష్టపోయాయి. రూపీ పరిస్థితిపై, దేశీయ ఆర్థిక పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించనున్నట్టు రిపోర్టులు వెలువడగానే, ఇన్వెస్టర్లు రూపాయిను కొనడం ప్రారంభించారు. దీంతో రూపాయి దాదాపు 70 పైసల మేర రికవరీ అయింది. ప్రస్తుతం 63 పైసల లాభంలో 72.07 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మార్నింగ్‌ ట్రేడింగ్‌లో అ‍త్యంత కనిష్ట స్థాయిల్లో 73 మార్కుకు చేరువలో 72.91 వద్దకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ కనిష్ట స్థాయిల నుంచి ప్రధాని సమావేశ నేపథ్యంలో రూపాయి భారీగా కోలుకుంది. ప్రధాని సమావేశ అనంతరం, రూపాయి పడిపోకుండా ఉండటానికి పలు చర్యలను ప్రకటించనున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement