ఇక షాపుల్లో షియోమీ ఫోన్లు..! | now xiaomi available in shops | Sakshi
Sakshi News home page

ఇక షాపుల్లో షియోమీ ఫోన్లు..!

Nov 28 2014 4:10 AM | Updated on Sep 2 2017 5:14 PM

ఇక షాపుల్లో షియోమీ ఫోన్లు..!

ఇక షాపుల్లో షియోమీ ఫోన్లు..!

మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ షియోమీ ఆఫ్‌లైన్ బాట పడుతోంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ షియోమీ ఆఫ్‌లైన్ బాట పడుతోంది. ఇప్పటి వరకు కేవలం ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివిధ మోడళ్లను భారత్‌లో విక్రయించిన ఈ చైనా ఆపిల్.. కొద్ది రోజుల్లో దేశీయ మార్కెట్లో రిటైల్ షాపుల్లోనూ దర్శనమీయనుంది. భారత్‌తోపాటు పలు దేశాల్లో హల్‌చల్ చేస్తున్న షియోమీ మొబైళ్లు సంప్రదాయ దుకాణాలకు చేరితే సంచలనాలు నమోదవడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

తమ కంపెనీ ఫోన్ల కోసం ప్రతివారం 2 నుంచి 3 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయని షియోమీ ఇండియా హెడ్ మను జైన్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే రోజున 1.75 లక్షల పీసులు విక్రయించామన్నారు. అయితే ఇటీవల ఆవిష్కరించిన రెడ్‌మి నోట్ 4జీ మోడల్ ఎయిర్‌టెల్ ఔట్‌లెట్లలో డిసెంబర్ నుంచి లభించనున్న సంగతి తెలిసిందే. రెడ్‌మి నోట్, మి 3, రెడ్‌మి 1ఎస్ కంపెనీ ఇతర మోడళ్లు.

 అభిమానులు పెరుగుతున్నారు..
 షియోమీ అభిమానులు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా అంటున్నారు. భారత్‌లో ఆఫ్‌లైన్ అమ్మకాల్లోకి త్వరలోనే ప్రవేశిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడి స్టార్టప్, అప్లికేషన్ డెవలపర్లు, సర్వీస్ ప్రొవైడర్లతో కలసి పని చేస్తామని చెప్పారు. ఇండోనేసియాలో గురువారం జరిగిన స్టార్టప్ ఆసియా జకార్తా 2014 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇండోనేసియాలోని ఇరాజయకు చెందిన రెండు స్టోర్లలో ఒకే రోజు 2,000 ఫోన్లు విక్రయించాం. ఆఫ్‌లైన్‌లోనూ స్పందన ఉందనడానికి ఇదే నిదర్శనం’ అని చెప్పారు.

గూగుల్ వన్ ఫోన్ తయారీ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం ఖాయమన్నారు. కాగా, ఒక ఉత్పత్తిని కొన్ని గంటలు మాత్రమే విక్రయించే ఫ్లాష్ సేల్స్/డీల్ ఆఫ్ ద డే విధానం అన్ని సందర్భాల్లోనూ భారత్‌లో విజయవంతం కాదన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్‌తో షియోమీ జత కలిసిందని వారంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement