
మహిళలకు ముత్తూట్ ప్రత్యేక గోల్డ్లోన్ స్కీమ్
బంగారు నగలపై అధిక రుణం ఇచ్చే విధంగా ‘ఆశా’ పేరుతో ముత్తూట్ ఫైనాన్స్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారు నగలపై అధిక రుణం ఇచ్చే విధంగా ‘ఆశా’ పేరుతో ముత్తూట్ ఫైనాన్స్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇతర పథకాలతో పోలిస్తే ఆశాపథకం కింద రుణం తీసుకునే మహిళలకు గ్రాముకు రూ.50 అదనంగా ఇవ్వనున్నట్లు ముత్తూట్ గ్రూపు డెరైక్టర్ జార్జ్ ఎం.అలెగ్జాండర్ తెలిపారు. ఈ కొత్త పథకం వివరాలను తెలియచేయడానికి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలెగ్జాండర్ మాట్లాడుతూ ప్రస్తుతం పుత్తడి విలువలో గరిష్టంగా 75% వరకు రుణం ఇస్తున్నట్లు చెప్పారు.
గరిష్ట మొత్తానికి రుణం తీసుకుంటే 24% వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని, అదే కనిష్ట మొత్తానికి తీసుకుంటే 12% వడ్డీకే రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. ఆశా పథకం కింద రుణం తీసుకునే మహిళలు ఆభరణాలు తమకు చెందినవనే ధ్రువీకరణపత్రం ఇవ్వాల్సి ఉంటుందని, గరిష్టంగా రూ.50,000 వరకు రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. గతేడాది రూ.26,387 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, ఈ మార్చి నాటికి ఈ విలువ కొద్దిగా తగ్గి రూ.26,000 కోట్లకు చేరుకోవచ్చని జార్జ్ వివరించారు.
త్వరలో 100 ఏటీఎంలు: బ్యాంక్ లెసైన్స్కి దాఖలు చేసిన ముత్తూట్ ఫైనాన్స్ ఇప్పుడు వైట్ లేబుల్ ఏటీఎంలపై అధికంగా దృష్టిసారిస్తోంది. ఇప్పటికే రెండు ఏటీఎంలను ఏర్పాటు చేశామని, వచ్చే నెలలోగా మరో 100 ఏటీఎంలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు జార్జ్ తెలిపారు. ఆర్బీఐ అనుమతుల ప్రకారం ముత్తూట్ ఫైనాన్స్ వచ్చే మూడేళ్లలో 9,000 ఏటీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంది.