
నిత్యావసరాల ధరలకు కళ్లెం వేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లిగడ్డలు, టమాట వంటి ధరలు కొండెక్కడంతో పాటు నిత్యావసరాల ధరలు నింగినంటుతూ ద్రవ్యోల్బణం చుక్కలు చూపుతున్న వేళ వీటిని కిందికి దించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో పలు చర్యలు ప్రకటించారు. ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు ఆయా పంటల దిగుబడులను పెద్ద ఎత్తున చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు చేపడుతుందని వెల్లడించారు.
ధరలను నియంత్రించేలా ఆహారోత్పత్తులను పెంచేందుకు ఉత్పాదకత మెరుగయ్యేలా రైతులకు కనీస మద్దతు ధర వంటి రాయితీలను ప్రకటించామని చెప్పారు. ఉద్యానవన పంటల మిషన్ (ఎంఐడీహెచ్), ఆయిల్సీడ్స్ జాతీయ మిషన్ (ఎన్ఎంఓఓపీ) వంటి ప్రత్యేక చర్యల ద్వారా నిత్యావసరాలు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిని పెంపొందిస్తామని తెలిపారు.