బ్యాంకుల నెత్తిన ‘గీతాంజలి’ బండ | Gitanjali gems trapped in scam | Sakshi
Sakshi News home page

బ్యాంకుల నెత్తిన ‘గీతాంజలి’ బండ

Apr 16 2018 1:50 AM | Updated on Apr 16 2018 1:50 AM

 Gitanjali gems trapped in scam - Sakshi

న్యూఢిల్లీ: కుంభకోణంలో చిక్కుకున్న గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిపోవడంతో మార్చి త్రైమాసికంలో బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,000 కోట్ల మేర పెరిగిపోనున్నాయి. గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు రూ.8,000 కోట్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎటువంటి చెల్లింపులు జరగలేదు. దీంతో ఈ మొండి బకాయిలకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. గత త్రైమాసికంలో ఎన్‌పీఏలుగా మారిన ఖాతాల్లో గీతాంజలి అతిపెద్దది కావడం గమనార్హం. డిసెంబర్‌ త్రైమాసికం నాటికి దేశీయ బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,40,958 కోట్లుగా ఉన్నాయి.

పీఎన్‌బీని రూ.13,000 కోట్ల మేర మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి గీతాంజలి జెమ్స్‌ గ్రూపు ప్రమోటర్‌ మెహుల్‌చోక్సీ దగ్గరి బంధువు కావడం గమనార్హం. ముంబైలోని సీబీఐ కోర్టు మోదీ, చోక్సీలకు వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్‌ వారంట్లు కూడా జారీ చేసింది. అలహాబాద్‌ బ్యాంకు సార«థ్యంలోని 21 బ్యాంకుల కన్సార్షియం గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాన్ని తొలుత 2010–11లో మంజూరు చేసింది. రూ.900 కోట్లతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ రుణంలో అధిక వాటా కలిగి ఉంది. 2015లో గీతాంజలికి ఇచ్చిన రుణాలను పునరుద్ధరించగా, 2017 డిసెంబర్‌ క్వార్టర్‌ వరకు ఈ రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులు జరిగాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు గీతాంజలి జెమ్స్‌ గ్రూపు రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించి నిధులు కేటాయించాల్సి ఉంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement