ఆంధ్రాబ్యాంక్‌పై ఎన్‌పీఏల భారం | Andhra Bank profit slides 83percent to Rs 34.46 crore | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్‌పై ఎన్‌పీఏల భారం

Feb 13 2016 12:30 AM | Updated on Sep 3 2017 5:31 PM

ఆంధ్రాబ్యాంక్‌పై ఎన్‌పీఏల భారం

ఆంధ్రాబ్యాంక్‌పై ఎన్‌పీఏల భారం

ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ మొండి బకాయిలు ఆందోళనకర స్థాయికి చేరాయి.

7 శాతానికి స్థూల మొండి బకాయిలు
83 శాతం తగ్గిన నికర లాభం.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ మొండి బకాయిలు ఆందోళనకర స్థాయికి చేరాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7 శాతానికి చేరింది. ఈ మూడు నెలల కాలంలో కొత్తగా రూ.2,051 కోట్ల నిరర్థక ఆస్తులు చేరడంతో మొత్తం స్థూల నిరర్థక ఆస్తుల విలువ రూ. 9,521 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు 3.89 శాతానికి చేరి రూ. 5,103 కోట్లుగా ఉన్నాయి.

 మొండి బకాయిలు పెరగడంతో నికర లాభంలో 83 శాతం క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 202 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 34 కోట్లకు పరిమితమయ్యింది. సమీక్షా కాలంలో ప్రొవజనింగ్ కేటాయింపులు రూ. 541 కోట్ల నుంచి రూ. 906 కోట్లకు పెరగడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇదే సమయంలో బ్యాంకు మొత్తం వ్యాపారం 17 శాతం వృద్ధితో రూ. 3.05,770 కోట్లకు చేరింది. ఈ సమయంలో రుణాలు 14.5 శాతం వృద్ధితో రూ. 1.18 లక్షల కోట్లకు చేరితే, డిపాజిట్లు 19 శాతం వృద్ధితో రూ. 1.42 లక్షల కోట్లకు చేరింది. డిపాజిట్లలో కాసా వాటా 25.9 శాతం నుంచి 27.2 శాతానికి చేరింది. ఈ త్రైమాసికంలో టైర్2 బాండ్స్ కింద రూ. 500 కోట్లు సమీకరించినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక ఫలితాలు వెలువడిన తర్వాత ఆంధ్రాబ్యాంక్ షేరు 3 శాతం నష్టపోయి రూ. 43.45 వద్ద ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement