ఆంధ్రాబ్యాంకు నష్టం  రూ.2,536 కోట్లు 

Andhra Bank lost Rs 2,536 crore - Sakshi

స్థూల ఎన్‌పీఏలు రూ.28,124 కోట్లు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మార్చి త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో ఆంధ్రాబ్యాంకు రూ.2,536 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.35 కోట్ల నికరలాభం పొందింది. టర్నోవరు రూ.5,424 కోట్ల నుంచి రూ.5,092 కోట్లకు వచ్చి చేరింది. 2017–18లో రూ.3,412 కోట్ల నష్టం వాటిల్లింది. అంత క్రితం ఏడాది బ్యాంకు రూ.174 కోట్ల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.20,336 కోట్ల నుంచి రూ.20,346 కోట్లుగా ఉంది.
 
కొండలా బకాయిలు.. 

బ్యాంకు బకాయిలు ఏటా గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. స్థూల నిరర్ధక ఆస్తులు రూ.17,670 కోట్ల నుంచి రూ.28,124 కోట్లకు చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు రూ.10,355 కోట్ల నుంచి రూ.12,637 కోట్లను తాకాయి. ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు 108 శాతం అధికమై రూ.8,774 కోట్లకు చేరుకున్నాయి.  

వ్యాపార వృద్ధి 9.7 శాతం.. 
ఆంధ్రాబ్యాంకు మొత్తం వ్యాపారం 9.7 శాతం వృద్ధి చెంది రూ.3,72,605 కోట్లకు చేరుకుంది. డిపాజిట్లు 6.46 శాతం అధికమై రూ.2,08,070 కోట్లు, అడ్వాన్సులు 14.08 శాతం పెరిగి రూ.1,64,535 కోట్లుగా ఉంది. రిటైల్‌ అడ్వాన్సులు 41.5 శాతం, వ్యవసాయ రుణాలు 11.86 శాతం, ఎంఎస్‌ఎంఈ అడ్వాన్సులు 23.61 శాతం పెరిగాయి. నికరవడ్డీ ఆదాయం 14.52 శాతం అధికమై రూ.6,335 కోట్లు నమోదైంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top