వచ్చే నెల 30 నుంచి ఎయిర్‌సెల్‌ సేవలు నిలిపివేత  | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 30 నుంచి ఎయిర్‌సెల్‌ సేవలు నిలిపివేత 

Published Thu, Dec 21 2017 12:08 AM

Aircel services will be suspended from next month 30 - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌ కంపెనీ ఆరు టెలికం సర్కిళ్లలో తన కార్యకలాపాలను వచ్చే నెల 30 నుంచి ఆపేయనున్నది. గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ టెలికం సర్కిళ్లలో జనవరి 30 నుంచి మొబైల్‌ సర్వీసులను నిలిపేస్తామని ఎయిర్‌సెల్‌ (ఎయిర్‌సెల్‌ లిమిటెడ్, డిష్‌నెట్‌ వైర్లెస్‌లను కలిపి ఎయిర్‌సెల్‌ గ్రూప్‌గా పరిగణిస్తారు)తెలిపింది. తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో వ్యాపారం నిర్వహించలేమంటూ ఈ ఆరు సర్కిళ్లలో లైసెన్స్‌లను సరెండర్‌ చేస్తున్నామని ఈ నెల 1నే ట్రాయ్‌కు  ఎయిర్‌సెల్‌ తెలిపింది.

 కంపెనీ ఈ 6 సర్కిళ్లలో 40 లక్షల మందికి 2జీ సేవలందిస్తోంది. వినియోగదారులందరికీ, 30 రోజుల ముందుగానే ఈ విషయాన్ని వెల్లడించామని, అందరికీ యూనిక్‌ పోర్టింగ్‌ కోడ్స్‌ను పంపించామని వివరించింది. కాగా వేరే నెట్‌వర్క్‌ను మారాలనుకుంటున్న ఎయిర్‌సెల్‌ వినియోగదారుల అభ్యర్థనలను వచ్చే ఏడాది మార్చి 10 వరకూ అంగీకరించాలని ఇతర టెల్కోలను ట్రాయ్‌ ఆదేశించింది. 

Advertisement
Advertisement