మెగా మెర్జర్‌ : ప్రభుత్వ బ్యాంకుల షేర్లు భారీ పతనం

After Mega merger Announcement of public sector huge selloff - Sakshi

సాక్షి, ముంబై : దలాల్‌ స్ట్రీట్‌మంగళవారం భారీ నష్టాలనుమూట గట్టుకుంది. ముఖ్యంగా జీడీపీ 5 శాతం ఆరేళ్ల కనిష్టానికి చేరడంతో పాటు,  కేంద్ర  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  శుక్రవారం  ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీనం భారీగా దెబ్బ తీసింది.  శని, ఆది, సోమ (వినాయక చవితి) సెలవుల అనంతరం మంగళవారం ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లలో  బ్యాంకుల షేర్లలో  ఇన్వెస్టర్ల అమ్మకాలు  భారీ పతనానికి దారి తీసాయి. జీడీపీ ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి నీరసించడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం వంటి ప్రతికూల అంశాలు మార్కెట్లను కుప్పకూల్చగా,  బ్యాంకింగ్‌ షేర్లను బాగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు,  ఇండియన్‌, ఓరియంటల్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు 5 నుంచి 12 శాతం కుప్పకూలాయి. పీఎన్‌బీ9 శాతం, ఇండియన్ బ్యాంకు 8 శాతం,  కెనరా బ్యాంకు 8 శాతం నష్టపోయాయి.  

10 ప్రభుత్వ బ్యాంకుల ఏకీకరణ ద్వారా నాలుగు బలమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏర్పాటు  ప్రకటన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. విలీన నిష్పత్తిపై స్పష్టత లేకపోవడం ఇన్వెస్టర్ల అమ్మకాలకు దారి తీసిందని నిపుణులు తెలిపారు. ఇండియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్, 12.5 శాతం కుప్పకూలింది. కెనరా బ్యాంక్ 11 శాతం నష్టపోయి 52 వారాల కనిష్టాన్నితాకింది. యూనియన్‌ బ్యాంక్‌ కూడా 9 శాతం కుప్పకూలి 52 వారాల కనిష్టానికి చేరింది. అలాగే ఓరియంటల్‌ బ్యాంకు 7 శాతం, పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) 9 శాతం పతనమైంది. నిఫ్టీ బ్యాంకు 600 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 120 పాయింట్లు (5 శాతం)  కుప్పకూలింది. 

విలీనంలో కీలకమైన నిష్పత్తి ప్రకటించకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ఎనలిస్ట్ వికాస్ జైన్ వ్యాఖ్యానించారు.  జియోజిత్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ, ఈ చర్య దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉన్నప్పటికీ, స్వల్ప కాలిక ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. విలీన ప్రక్రియ పూర్తయ్యి, తిరిగి సాధారణ పరిస్థతి రావడానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుందన్నారు.

మరోవైపు కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌)మెరుగుపడేందుకు వీలుగా కేంద్ర కేబినెట్‌ తాజాగా రూ.9వేల కోట్లను అందించనుందనే వార్తలతో ఐడీబీఐ బ్యాంకు కౌంటర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.  ఐడీబీఐ బ్యాంక్‌ షేరు 8.2 శాతం దూసుకెళ్లి చివరికి 6శాతం లాభాలతో ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top