అబద్ధాల్లో చంద్రబాబుకు డాక్టరేట్!

అబద్ధాల్లో చంద్రబాబుకు డాక్టరేట్! - Sakshi


ధ్వజమెత్తిన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

 సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించడంలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఎవరికైనా డాక్టరేట్‌ను ఇవ్వాల్సి వస్తే అది తప్పకుండా సీఎం చంద్రబాబునాయుడుకే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. ‘కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలు లేదా ఉస్మానియా, ఎస్వీయూలు గానీ అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను నిలువునా మోసగించటంలో డాక్టరేట్ ఇవ్వాల్సి వస్తే చంద్రబాబుకే  ఇస్తాయి’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏపీ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి అనిల్‌కుమార్‌తో పాటు విపక్ష సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, భూమా నాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కోన రఘుపతి తదితరులు అడిగిన ప్రశ్నపై చర్చ జరిగింది.



ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో కోతలు విధించడం లేదని, అందరికీ ఇస్తామంటూ సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఇచ్చిన సమాధానంతో విపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. ‘2013-14 ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో 50 శాతం ఇంకా ఇప్పటికీ చెల్లించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 50 వేల మంది విద్యార్థులు తెలంగాణలో చదువుకుంటుంటే 14 వేల మందేనని మంత్రి చెబుతున్నారు. బీసీ విద్యార్థులకు ఆధార్‌తో సంబంధం లేకుండా రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని విస్మరించి వారికి అన్యాయం చేస్తున్నారు’ అని అనిల్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కిషోర్‌బాబు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 371- డి ప్రకారం స్థానికులైన విద్యార్థులుందరికీ రీయింబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుందని మంత్రి వివరణ ఇచ్చారు.

 

 రైతులు ఇబ్బంది పడుతున్నారు: స్పీకర్

 పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు న్యాయం జరగడం లేదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా ప్రభుత్వానికి చురక అంటించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రవాణా కాంట్రాక్టర్లు అందుబాటులో ఉండటం లేదంటూ సభ్యుడు రమణమూర్తి అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి పరిటాల సునీత పొడిపొడిగా సమాధానం చదివినప్పుడు స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఎఫ్‌సీఐ లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి సూచించారు.

 

 గ్రామాలకు వెళ్లి కౌలు రైతులకు కార్డులివ్వాలి

 రుణ అర్హత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కౌలు రైతులకే ప్రభుత్వం వాటిని మంజూరు చేస్తుందని వ్యవసాయ శాఖ మం త్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన సమాధానం పట్ల ఇటు ప్రతిపక్షంతో పాటు అధికార పక్ష సభ్యులూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగమే గ్రామాలకు వెళ్లి కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయం చేస్తున్న వారి లో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని, కరువు ప్రభావం కూడా కౌలు రైతుల మీదే అధికంగా ఉంటుందని వైస్సార్‌సీపీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ ఖరీఫ్‌లో ఎంత మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చారో చెప్పాలని విపక్ష సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు.రుణమాఫీలో కౌలు రైతులకే ప్రాధాన్యమిచ్చామన్న వ్యవసాయ మంత్రి లబ్ధిదారుల వివరాలను చెప్పలేదు.

 

 ఐటీ పార్కుల్లో దివంగత నేత వైఎస్ ఫొటో : బీజేపీ శాసనసభా పక్ష నేత

 విశాఖలో ఐటీ పార్కులకు దివంగత   సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పారదర్శకంగా స్థలాలు కేటాయించారని, అన్ని కంపెనీల్లో వైఎస్సార్ ఫోటో ఉం టుందని బీజేపీ ఎల్పీనేత విష్ణుకుమార్‌రాజు చెప్పారు. విశాఖపట్నానికి ఐటీఐఆర్ మంజూరు చేసే ప్రతిపాదన ఉందా? అని వాసుపల్లి గణేష్‌కుమార్ అడిగిన ప్రశ్న మీద జరిగిన చర్చలో బీజేపీ నేత పాల్గొన్నారు.  తమ కష్టాలు తీర్చాలని గతంలో ఓ ఐటీ మంత్రికి చెబితే కరచాలనం చేసి వేలితో గోకారని, ఎందుకు గోకారో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు.

 

 మార్చిలోగా 13వ ఆర్థిక సంఘం నిధులు: యనమల

 13 ఆర్థిక సంఘం నిధులు తెచ్చుకోకుండా, సింగపూర్, జపాన్ నుంచి విదేశీ పెట్టుబడులు తెచ్చుకుంటామంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందని వైఎస్సార్ సీపీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ విమర్శించారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల స్పందిస్తూ మార్చిలోగా నిధులు తీసుకొస్తామని చెప్పారు.

 

 కర్నూలులో హజ్ హౌస్ : మంత్రి పల్లె

 రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలులో హజ్‌హౌస్ నిర్మించనున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విపక్ష సభ్యుడు భూమా నాగిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం పట్ల మైనార్టీల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని భూమా పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు.

 

 మరో 100 డయాలసిస్ కేంద్రాలు

 ఆరోగ్యశ్రీ పరిధిలోకి అదనంగా కొన్ని వ్యాధులు చేర్చారని, చికిత్సా వ్యయాన్ని రూ.2.5 లక్షలకు పెంచారని, కానీ బడ్జెట్‌లో కేటాయింపులను గత ఏడాది కంటే తగ్గించిన నేపథ్యంలో పథకాన్ని ఎలా అమలు చేయగలరని వైఎస్సార్ సీపీ సభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులపై ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం అందించడం లేదన్నారు.  డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరగా స్పందించిన మంత్రి కామినేని శ్రీనివాస్ డయాలసిస్ కేంద్రాలను మరో 100 ఏర్పాటు చేస్తామన్నారు.

 

 చిత్తూరులో బిందు సేద్యానికి 90 శాతం రాయితీ ఇవ్వండి

 అనంతపురం మాదిరిగా చిత్తూరు జిల్లాలోనూ బిందు, తుంపర సేద్యం సాగు కు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ సభ్యుడు రామచంద్రారెడ్డి చేసిన విజ్ఞప్తికి వ్యవసాయ శాఖ మంత్రి పి.పుల్లారావు సానుకూలంగా స్పందించారు.

 

 జీరో అవర్

 శుక్రవారం ఏపీ శాసనసభ జీరో అవర్‌లో సభ్యులు చేసిన ప్రస్తావనలు..

 జంఝావతి ప్రాజెక్టులను వెంటనే  పూర్తి చేయాలి. ఒడిశాలోని ముంపు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

 - టీడీపీ సభ్యుడు చిరంజీవులు

 

 అటవీ అనుమతుల్లేక గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఫలితంగా గిరిజనులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నాలుగు శాఖలు రోడ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నాయి. ఈ నాలుగు శాఖలు సమన్వయంతో పనిచేయకపోవడం వల్లే అటవీ అనుమతులు రావడం లేదు.

 - వైఎస్సార్‌సీపీ సభ్యురాలు కళావతి

 

 టైరు బండ్లతో ఇసుక రవాణా చేస్తూ జీవిస్తున్న వందలాది కుటుంబాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఇసుకను ఉచితంగా పెన్నా నది నుంచి తీసుకోవడానికి అవకాశం ఉండగా, ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఫలితంగా.. ఇసుక కొనాల్సి వస్తోంది. ఫలితంగా వందలాది కుటుంబాల జీవనోపాధిని కోల్పోయాయి. ఉదయం, సాయంత్రం ఒక్కో బండి ఇసుకను ఉచితంగా తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలి.

 - టీడీపీ సభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

 

 కావలి కాలువకు నీరిస్తామని అధికారులు చెప్పడంతో కాలువ కింద రైతులు నాట్లు వేశారు. ఇప్పుడు నీరివ్వలేమని అధికారులు చెబుతున్నారు. నాట్లు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కావలి కాలువకు వెంటనే నీరిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

 - వైఎస్సార్‌సీపీ సభ్యుడు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి

 

 కండలేరు నుంచి గూడూరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకు నీరు అందించడానికి ఉద్దేశించిన పైపులైన్ పనులు చేపట్టకుండానే కాంట్రాక్టర్ కోట్లాది రూపాయల బిల్లులు తీసుకుంటున్నారు. ఈ అవినీతి బాగోతాన్ని విచారించి చర్యలు తీసుకోవాలి.

 - వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్

 

 తేమ పేరుతో సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయడంలేదు. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. పత్తి రైతులకు క్వింటాలుకు రూ. 500 ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.

 - టీడీపీ సభ్యుడు శ్రావణ్‌కుమార్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top