మొద్దు ప్రభుత్వాన్ని మేల్కొలుపుదాం | ysr congress Bhuma nagireddy kept letter to government | Sakshi
Sakshi News home page

మొద్దు ప్రభుత్వాన్ని మేల్కొలుపుదాం

Aug 5 2013 2:58 AM | Updated on May 25 2018 9:10 PM

రాజకీయాలకు అతీతంగా రైతులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సాగునీటి విషయంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి తెలిపారు.

నంద్యాల, న్యూస్‌లైన్: రాజకీయాలకు అతీతంగా రైతులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సాగునీటి విషయంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయమై సోమవారం నంద్యాలలోని మున్సిపల్ టౌన్ హాల్‌లో నేడు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ పోరాటం సాగిస్తున్నట్లు చెప్పారు. తన దీక్ష ఒక్క నంద్యాలకే పరిమితం కాదని.. తుంగభద్ర, కృష్ణా జలాలపై ఆధారపడిన ఏ ఒక్క అన్నదాత నష్టపోకూడదన్నదే ధ్యేయమన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే కృష్ణా జలాలపైనే లక్షలాది ఎకరాల భవితవ్యం ఆధారపడి ఉందని.. తెలంగాణ ప్రకటనతో ఆ ప్రాంతాన్ని దాటుకుని నీరు పారాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జిల్లాలో లక్షలాది రైతుల భవిష్యత్తు అంధకారం కానుందన్నారు. సాగునీటి సమస్యలతో ఈ ప్రాంతం బీడువారే ప్రమాదం ఉన్నా.. ఇక్కడి నాయకులు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు.
 
 అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల బాగోగులు పట్టవని.. ఎంతసేపు వారు సీట్లను కాపాడుకునేందుకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. వరుణుడు కరుణిస్తే సరేసరి.. లేకపోతే రైతులు ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. అన్నదాతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని.. సాగునీటి విషయంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు పోరాటం సాగిస్తానన్నారు. పంటలపై ఆధారపడే ఎన్నో మిల్లుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందన్నారు. సాగునీటి ఇబ్బందులు తలెత్తితే వీటితో పాటు కార్మికులు కూడా వీధినపడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కూలీలు సైతం ఉపాధి కోల్పోతారన్నారు.
 
 ఇప్పటికే వరుస కరువుతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వం నిలువరించలేకపోతోందన్నారు. అలాంటిది సాగునీరు అందకపోతే ఇక అన్నదాతలు ఎలా జీవితంచగలరో నేతలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. విభజన కారణంగా సాగునీటితో పాటు తాగునీటి సమస్యతోనూ ఎన్నో గ్రామాలు విలవిల్లాడాల్సి వస్తుందన్నారు. కర్నూలు పట్టణానికి సుంకేసుల, నంద్యాల పట్టణానికి వెలుగోడు రిజర్వాయర్ నుంచి తాగునీరు సరఫరా అవుతోందని.. అలాగే తెలుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ తదితర ప్రాజెక్టుల ద్వారా వందలాది చెరువులను నింపుకోవడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుతోందన్నారు.
 
 తెలంగాణతో నీరందకపోతే తాగునీటి కోసం ప్రజలు అల్లాడాల్సిందేనన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు అధిక పరిణామంలో నీటి విడుదల చేయడం సమంజసం కాదన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఇదే విషయమై రాజీనామా అస్త్రాన్ని సంధించి నంద్యాల పార్లమెంట్‌కు నీటి విడుదలను చేయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా ఇన్‌ఫ్లో కంటే ఔట్‌ఫ్లో అధికంగా ఉంటున్నా నాయకులు నోరు మెదపకపోవడంలో అర్థం లేదన్నారు. దీక్షలో భాగంగా పట్టణంలోని నూనెపల్లె మార్కెట్‌యార్డు నుంచి ప్రభుత్వాసుపత్రి, తహశీల్దార్ కార్యాలయం, టెక్కె మార్కెట్‌యార్డు, శోభా సెంటర్ మీదుగా రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలోని మున్సిపల్ టౌన్‌హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని భూమా వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement