‘సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి’

YS Jagan Speech At 209th SLBC Meeting - Sakshi

సాక్షి, అమరావతి : నగదు బదిలీ రూపంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాల వారికి చేరవేయడానికి ఉద్దేశించిన అన్‌ ఇంకబర్డ్‌ ఖాతాలు అందించడంలో బ్యాంకులు చక్కటి సహకారాన్ని అందించాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలిగామని అన్నారు. మంగళవారం సచివాలయంలో 209వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  ‘రైతులకు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నవారికి, మత్స్యకారులకు, చేనేతలకు, అగ్రిగోల్డ్‌ బాధితులకు, లా నేస్తం కింద దాదాపు రూ.15వేల కోట్లకుపైనే నగదును బదిలీ ద్వారా ఇచ్చాం. పిల్లలను బడికిపంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద ఈ నెలలో సుమారుగా రూ. 6500 కోట్లు ఇవ్వబోతున్నాం. 

ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు, దాని ప్రభావం సమాజంలోని అట్టడుగు వర్గాలపైనే ఉంటుంది. ఈ పథకాల ద్వారా అట్టడుగున ఉన్న వర్గాల వారికి ఆక్సిజన్‌ అందించగలిగాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 60శాతం వ్యవసాయ రంగమే, 62 శాతం మంది ప్రజలు ఈరంగంపైనే ఆధారపడుతున్నారు. వారిని ఆదుకోకపోతే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని అనుకోలేం. ప్రభుత్వం, బ్యాంకులు ఒకేతాటిపైకి వస్తే మరిన్ని కార్యక్రమాలు చేయగలం. ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయి. అలాగే రైతు భరోసాతో రైతులను ఆదుకున్నాం. వ్యవసాయ రంగం బాగుండడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాం. 


కౌలు రైతుల చట్టం పూర్తి పారదర్శకంగా ఉంది..
కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడంలేదని ఎస్‌ఎల్‌బీసీ లెక్కలు చెప్తున్నాయి. అందుకే కౌలు రైతులకోసం ఒక చట్టాన్ని తీసుకు వచ్చాం. కౌలు రైతుల చట్టం పూర్తి పారదర్శకంగా ఉంది. రైతుల హక్కులను పరిరక్షిస్తూనే.. 11 నెలలకు సాగు ఒప్పందం ఈ చట్టం ద్వారా వీలు కల్పిస్తోంది. రైతుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ప్రతి 2వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉంది, 10 నుంచి 12 మంది ఉద్యోగులు వారికి అందుబాటులో ఉన్నారు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉన్నారు. ప్రతి పథకాన్ని పారదర్శక విధానంలో వివక్షకు, అవినీతికి తావులేకుండా అందిస్తున్నాం. 

గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కూడా ఉన్నారు. వీరిని సమర్థవంతంగా వాడుకోవాలి. కౌలు రైతు చట్టం వల్ల మరింత మంచి జరుగుతుంది. ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. కౌలు రైతులకు మంచి జరిగేలా బ్యాంకర్లు మరింత ముందడుగు వేయాలి. వారిలో చైతన్యం, అవగాహన కలిగించేలా వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్‌నాటికి దాదాపు 11వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. శిక్షణ కేంద్రంలా, రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అదించేలా ఈ రైతు భరోసా కేంద్రాలు వ్యవహరిస్తాయి. వీటికి ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇస్తుంది. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతు భరోసా కేంద్రాల్లో శిక్షణ ఇస్తాం. అలాగే రైతుల ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా కూడా భవిష్యత్తులో ఇవి పనిచేస్తాయి. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధినికూడా పెట్టాం. రైతు భరోసా కేంద్రాలను ఇంటర్నెట్‌ సౌకర్యంతో అనుసంధానిస్తాం.  దీనివల్ల డిజిటలైజేషన్‌ పెరుగుతుంది.  బ్యాంకర్లు, ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేయాల్సి ఉంది. 


సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి..
వైఎస్సార్‌ నవోదయం కింద కూడా ఖాతాల పునర్‌ వ్యవస్థీకరణపై కూడా దృష్టిపెట్టాలి. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలి. ఏపీ ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో 12 ర్యాంకులో ఉందని చెప్తున్నారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలి. చిరువ్యాపారులు, తోపుడు బళ్లమీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వడ్డీలేని రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. గుర్తింపు కార్డులతో వీరికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నది ఆలోచన. దీంతో దాదాపు 12 లక్షల మంది లబ్ధిపొందుతారని అంచనా వేస్తున్నాం. ప్రధాన మంత్రి ముద్ర యోజన ఇక్కడ సద్వినియోగం అవుతుందని ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ దీనిపై దృష్టిపెడతాం.

అలాగే స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా దృష్టిపెట్టాలి. వడ్డీలేని రుణాలు మహిళా సంఘాలకు ఇస్తాం. అలాగే రైతులకూ ఇస్తాం. ఈ రెండింటికీ ప్రభుత్వం తప్పకుండా భరోసా ఇస్తుంది. మహిళలు, రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వారికి రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం. స్వయం సహాయక సంఘాల రుణాలపై వివిధ జిల్లాల్లో వేసే వడ్డీల్లో వ్యత్యాసం ఉంది. 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో  12 శాతం ఉంది. దీన్ని తొలగించేలా కృషిచేయాల్సి ఉంది. సకాలంలో రైతులకు, స్వయం సంఘాలకు రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం. వడ్డీ చెల్లింపునకు ప్రభుత్వం బ్యాంకర్లకు భరోసా ఇస్తుంది. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకింద పెట్టిన బకాయిలు రూ. 648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెప్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు హామీలు ఇచ్చి.. విఫలమవుతాయి. ఈ డబ్బు చెల్లించాలని పదేపదే బ్యాంకులు నా దృష్టికి తీసుకు వచ్చాయి. ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలను కూడా బ్యాంకర్లు దృష్టిపెట్టాలని కోరుతున్నాం. అనవసర వ్యయాలను తగిస్తున్నాం. ప్రాధాన్యతల ప్రకారం ముందుకు పోతున్నాం. ఈ మధ్యకాలంలో పత్రికల్లో హెడ్డింగులు చూస్తూనే ఉన్నారు. కానీ, మేం తీసుకున్న చర్యలన్నీ సదుద్దేశంతో తీసుకున్నవే. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నాం. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉంది. 


మాకు కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి..
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరదజలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సీడబ్ల్యూసీ డేటా ప్రకారం శ్రీశైలం వద్ద కృష్ణాలో వచ్చిన నీళ్లు 47 సంవత్సరాల సగటు 1200 టీఎంసీలు, గత 10 ఏళ్లలో 600 టీఎంసీలకు పడిపోయింది. గత 5 ఏళ్లలో 400 టీఎంసీలకు పడిపోయింది. మరోవైపు గోదావరిలో 3వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి. గోదావరి మిగులు జలాలను వాడుకోవాల్సి ఉంది. 62శాతం ప్రజలు ఇంకా వ్యవసాయంమీద ఆధారపడి ఉన్నారు. రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేసి కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. 

సంపూర్ణ అక్ష్యరాస్యత దిశగా అడుగులు..
స్కూళ్లు, ప్రభుత్వాసుపత్రులను తిరిగి పునరుద్ధరిస్తున్నాం. నాడు – నేడు కింద కార్యక్రమాలు చేపడుతున్నాం. మొత్తం 45 వేల స్కూళ్లు, జూనియర్‌కాలేజీలు, డిగ్రీ కాలేజీలను బాగుచేస్తున్నాం. దాదాపు రూ12వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగు వేస్తున్నాం. ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెడుతున్నాం. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతున్నాం. వచ్చే 4–5 ఏళ్లలో విద్యాపరంగా మిగిలి రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నాం.

ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు..
ఈ ఉగాది నాటికి సంతృప్తస్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా 25 లక్షల ఇళ్లపట్టాలు ఇస్తున్నాం. ఆతర్వాత ప్రతి ఏటా 6 లక్షల చొప్పున ఇళ్లు కడతాం. ఈకార్యక్రమం పారిశ్రామికంగా చాలా ఉపయోగపడుతుంది. సిమ్మెంటు, ఐరన్‌ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయి. అలాగే వాటర్‌ గ్రిడ్‌ ద్వారా రక్షిత తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆమేరకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల జీవనప్రమాణాలు పెంచేవి. వీటికి బ్యాంకర్లుగా మీ సహాయం కావాలి’ అని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top