సంకల్పధారి..

YS Jagan Praja Sankalpa Yatra One Year Special Story PSR Nellore - Sakshi

పాదయాత్రతో క్షేత్రస్థాయిలో సమస్యల అధ్యయనం

జిల్లాలో అలుపెరగక సాగిన ప్రజాసంకల్ప యాత్ర

వ్యక్తిగత సమస్యలు మొదలు జిల్లా సమస్యల వరకు జననేత దృష్టికి

నిత్యం వేలాది మందికి భరోసా ఇస్తూ ముందుకు

ఉలిక్కిపడి.. ఉద్యమించి

అలుపెరగని బాటసారి అతను. నిత్యం వేలాది మందిని కలుస్తూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. వ్యక్తిగత సమస్యలు మొదలుకొని జిల్లా సమస్యలు వరకు అనేకం క్షేత్రస్థాయిలో తెలుసుకుని, పరిశీలించి వారందరికి భరోసా కల్పించారు. కొన్ని గంటలు, కొద్ది రోజులు పాదయాత్ర చేయడానికే కష్టంగా మారిన తరుణంలో సరిగ్గా ఏడాది నుంచి పాదయాత్ర చేస్తూ లక్షలు కాదు కోట్ల మందిని వ్యక్తిగతంగా కలిసి వారి కష్టాలు విని నేనున్నాంటూ జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యమిచ్చారు. పాదయాత్ర చేస్తున్న జననేతపై హత్యాయత్నం జరిగినా చెదరని సంకల్పంతో యాత్ర కొనసాగించడానికి సన్నద్ధమవుతున్నారు. ఎండకు వానకు వెరవక, రాజకీయ కుట్రలు లెక్క చేయకుండా ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. జిల్లాలో సాగిన యాత్ర ఆద్యంతం ఓ వైపు సమస్యలు వింటూ మరో వైపు అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం నాటికి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు  : ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబర్‌ 6వ తేదీ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర నిరాఘాటకంగా సాగుతోంది. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ద్వారా జిల్లాలో సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. సాధారణంగా నేతల ద్వారా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తుంటారు. కానీ ఆయన మరో అడుగు ముందుకు వేసి నేరుగా ప్రజల్లోకి వచ్చి వారి సాధక బాధకాలనువింటూ ప్రతి ఒక్కరి సమస్యలు అడిగి తెలుసుకోవడం అత్యంత అరుదుగా జరిగేది. అలాంటి సాహసోపేతమైన యాత్రకు జననేత జగన్‌ శ్రీకారం చుట్టారు.

నేత నడిచిన దారి అంతా జనసంద్రంగా మారటంతో పాటు పార్టీ నిర్వహించిన సభలకు జనప్రభంజనం పోటెత్తింది. ఈ ఏడాది జనవరి 23న జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పునబాకలో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో ముగిసి ప్రకాశం జిల్లాలోకి చేరింది. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు జన నేత వెంట అడుగులు వేసేందుకు పోటీలు పడ్డారు. రాష్ట్ర రాజకీయాల దిశను మార్చే పాదయాత్రగా నేతలు అభివర్ణించారు. పాదయాత్ర వెయ్యి కిలో మీటర్ల కీలక వేదికగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నిలిచింది. ఈ సందర్భంగా అశేష జనవాహని జననేత వెంట వాక్‌ విత్‌ జగనన్నలో పాల్గొన్నారు. 100 కిలో మీటర్ల కీలక ఘట్టానికి ఆత్మకూరు నియోజకవర్గం వేదిక అయింది. అక్కడ 72 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.

సభ్యుల ఆత్మీయ సమావేశాలతో మరింత చేరువ
జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరురూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఇటుక బట్టీల కార్మికుల కష్టాలు మొదలుకొని పొగాకు రైతుల ఇబ్బందుల వరకు అన్నింటిని ప్రత్యక్షంగా చూశారు. దీంతో పాటు లక్షల మంది వ్యక్తిగత సమస్యల్ని జననేత దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ముఖ్యంగా బట్టీ కార్మికులు, సెజ్‌ల్లో పనిచేసే కార్మికుల కష్టాలు, వరి, నిమ్మ, పొగాకు, మినుము, శనగ, తదితర పంటల రైతులు అనేక చోట్ల జననేతను కలిసి కష్టాలను చెప్పారు. చేనేత కార్మికుల దయనీయ స్థితి, చేతివృత్తి కళాకారుల కష్టాలు, వివిధ వర్గాలు, కులాల ప్రజల ఇబ్బందులు జననేత దృష్టికి వచ్చాయి. 

జనవరి 23 నుంచి ఫిబ్రవరి 15 వరకు
జనవరి 23న ప్రారంభం సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పునబాకలో ప్రారంభమైన యాత్ర  ఫిబ్రవరి 15న  ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో ముగి సింది. 9 నియోజకవర్గాల్లో 14 మండలాలు 142 గ్రామాల్లో 266.5 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. చేనేత, యాదవ, అర్యవైశ్య, ముస్లిం, మహిళలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సాధక బాధకాలను తెలుసుకుని వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సూళ్లూరుపేటలో పెళ్లకూరు(చెంబేడు), నాయుడుపేట గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి (పొదలకూరు), నెల్లూరు రూరల్‌ (సౌత్‌ మోపూరు), కోవూరు (బుచ్చిరెడ్డిపాళెం), ఆత్మకూరు (సంగం), కావలి (దగదర్తి),ఉదయగిరి (కలిగిరి)లో బహిరంగ సభల్లో ప్రజలు నీరాజనం పలికారు.

ఉలికి పడి..ఉద్యమించి
ప్రజలను కలుసుకుంటూ.. బాధలను తెలుసుకుంటూ వేల కిలో మీటర్లు సుదూర ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరగడంతో నెల్లూరు ప్రజలు ఉలికి పడ్డారు. వైఎస్సార్‌సీపీ అభిమాని ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసిన దురాఘాతుకాన్ని ఖండిస్తూ.. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు టీడీపీ హత్యారాజకీయ కుట్రలపై కదం తొక్కారు. ఊరూరు ఉద్యమ బాటలు పట్టాయి. హత్యాయత్నంలో తీవ్రగాయానికి గురైన జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో కోలుకోవాలని సర్వమతప్రార్థనలు, పూజలు చేశారు. వేలకు వేల కొబ్బరి కాయలు ముక్కోటి దేవుళ్లను మొక్కారు. రాజకీయ పార్టీలకు అతీతంగా (టీడీపీ మినహా) ఆయా పార్టీల నేతలు, ప్రజా సంఘాలు జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనను ఖండించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top