తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రారంభం

YS Jagan, KCR Meeting at Pragati Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసమైన ప్రగతి భవన్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు. ఆయనకు కేసీఆర్‌ స్వయంగా స్వాగతం పలికి లోపలికి తోడ్కోని వెళ్లారు. అనంతరం వీరిద్దరి భేటీ ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగే అవకాశముంది. విభజన  చట్టంలోని పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతారు. జల వనరుల సద్వినియోగం.. 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు.

కేసీఆర్‌కు జగన్‌ ఆహ్వానం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) తరపున ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు వైఎస్ జగన్‌ అందజేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు సీఎం జగన్‌ వెంట ఉన్నారు.

సమావేశం ముగిసిన తర్వాత ఈ రాత్రికి లోటస్‌పాండ్‌లోనే సీఎం వైఎస్‌ జగన్‌ బస చేయనున్నారు. మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 11.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top