ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా రాయలసీమ ప్రాంతంలో సీమాంధ్రులు చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా రాయలసీమ ప్రాంతంలో సీమాంధ్రులు చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందులలో సమైక్యవాదులు ఏర్పాటు చేసిన పొలికేక కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే కడపలోని జిల్లా పరిషత్ హాల్లో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనతో జల వివాదాల అంశంపై నేడు సదస్సును నిర్వహించనున్నారు.
ఆ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ.మైసూరారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అలాగే అనంతపురంలో జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన ఆందోళనలు నేడు 60వ రోజుకు చేరాయి. నేడు ఉరవకొండలో విద్యార్థుల ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన ఏర్పాటు చేశారు. జిల్లాలో జాక్టో, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతోన్నాయి. గత రెండు నెలలుగా జిల్లాలోని దాదాపు 1000 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి.
దాంతో రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ప్రాంతీయ అధికారి వెల్లడించారు. ఆక్టోబర్ 2వ తేదీ నుంచి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.1000 మందితో ప్రతిరోజు దీక్షలు చేపటనున్నట్లు విశ్వేశ్వరరెడ్డి వివరించారు. చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వరదయ్యపాలెం మండలం బతలావలం వద్ద YSRCP నేత ఉజ్వాలరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు రాస్తారోకో నిర్వహించారు. దాంతో తిరుపతి-చెన్నై మార్గంలో రాకపోకలు స్తంభించాయి. దాంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ బారులు తీరింది.