నేడు, రేపు తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం పర్యటన | Today, tomorrow, the 14th Finance Commission visit to Tirupati | Sakshi
Sakshi News home page

నేడు, రేపు తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం పర్యటన

Sep 11 2014 1:04 AM | Updated on Sep 2 2017 1:10 PM

నేడు, రేపు తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం పర్యటన

నేడు, రేపు తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం పర్యటన

డాక్టర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం గురు, శుక్రవారాల్లో తిరుపతిలో పర్యటించనుంది. 11వ తేదీ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతికి...

తిరుపతి: డాక్టర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం గురు, శుక్రవారాల్లో తిరుపతిలో పర్యటించనుంది. 11వ తేదీ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకునే కమిషన్ సాయంత్రం 4 గంటలకు జిల్లా పాలనాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అవుతుంది. రాత్రి తిరుపతిలోనే బస చేసి 12న తిరుచానూరు రోడ్డులోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌లో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతోపన్యాసంతో రెండోరోజు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 10.35 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.

11 గంటల నుంచి  ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ప్రగతికి సంబంధించి సూచించిన కీలక అంశాలపై చర్చ అనంతరం ఫైనాన్స్ కమిషన్ తన స్పందన తెలియజేస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులతో అనంతరం స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాల ప్రతినిధులతో కమిషన్ విడివిడిగా సమావేశమవుతుంది. రాత్రి ఇక్కడే బస చేసి 13 ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టీ బుధవారం పర్యవేక్షించారు.
 
అధికారులంతా తిరుపతికి

చిత్తూరు(సెంట్రల్):  శుక్రవారం 14వ ఆర్థిక సంఘం సమావేశం తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో జరగనున్న విషయం విదితమే. ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులంతా గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకోనున్న నేపథ్యంలో వారికి భోజనం, వసతి సౌకర్యాల కల్పన కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచే తిరుపతికి బయలుదేరి వెళ్లారు. పలువురిని చైర్మన్, సభ్యులకు లైజాన్ అధికారులుగా నియమించారు. దీనికి తోడు ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ కార్యదర్శులు రానున్న నేపథ్యంలో ప్రొటోకాల్ నిబంధనల మేరకు ప్రధాన అధికారులంతా వారి సేవలో ఉండాల్సి ఉంది. దీంతో ప్రతి శాఖాధికారి తప్పనిసరిగా మూడు రోజుల పాటు (గురు, శుక్ర, శని) తిరుపతిలో ఉండేందుకు సిద్ధమై వెళ్లారు.
 
భారీ బందోబస్తు

తిరుపతి క్రైం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుపతికి వస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎస్పీ గోపీనాథ్ జట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి  విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు చేరుకుని సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం అక్కడే భోజన కార్యక్రమం అయిన తరువాత సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరుతారని సమాచారం. పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్లను అణువణువునా బుధవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జారుుంట్ కలెక్టర్, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement