సీమాంధ్ర ఉద్యోగులకు టీఎన్జీవో నేతల పిలుపు | TNGOs leaders to call Simandhra employees | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యోగులకు టీఎన్జీవో నేతల పిలుపు

Sep 4 2013 5:55 AM | Updated on Sep 1 2017 10:26 PM

తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవద్దని, విభజనకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి కోరారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవద్దని, విభజనకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకూ పరిష్కారమని, ఏవైనా అనుమానాలుంటే ఏపీఎన్జీఓలు ప్రత్యేకంగా చర్చ పెడితే వాటిని నివృత్తి చేస్తామని చెప్పారు. ఈ చర్చ కార్యక్రమం ఏర్పాటుపై సీఎం కిరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చొరవ చూపాలని కోరారు.
 
 రంగారెడ్డి జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యమంపై ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతోందని ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డి మాండ్ చేశారు. తెలంగాణ ప్రకటన వెలువడి 32 రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని వారు చెప్పారు. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత తెలంగాణలో జరిగిన పోస్టింగులపైనా పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. 7న టీజేఏసీ తలపెట్టిన శాంతిర్యాలీలో ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం
 చేయాలని కోరారు.  
 
 శాంతి ర్యాలీని విజయవంతం చేయాలి
 ఈనెల 7న సిటీ కళాశాల నుంచి ప్రారంభమయ్యే శాంతి ర్యాలీలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ (టీజేఏసీటీ) పిలుపునిచ్చింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఏసీటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ లక్షా 20 వేల మంది ఉపాధ్యాయులు భాగస్వామ్యమైతే తెలంగాణ వచ్చి తీరుతుందన్నారు.టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజేఏసీటీ ఛైర్మన్ ఎ. అనంతరాములు కూడా మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement