2024 కల్లా ఏపీలో మూడు ఏఐఐబీ ప్రాజెక్టులు పూర్తి  | Sakshi
Sakshi News home page

2024 కల్లా ఏపీలో మూడు ఏఐఐబీ ప్రాజెక్టులు పూర్తి 

Published Tue, Nov 19 2019 9:28 PM

Three AIIB Projects In AP Are Set to Complete By 2024 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2024 కల్లా ఏపీలో మూడు ఆసియా ఇన్ఫాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌( ఏఐఐబీ) ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ థాగూర్‌ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ఈ ప్రశ్నకు కేంద్ర మంతి అనురాగ్‌ సింగ్‌ సమాధానం చెప్పారు. రూ.7 వేల కోట్ల నిధులు సమకూర్చడానికి ఏఐఐబీ ఆమోదం తెలినట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ 24 గంటల విద్యుత్‌ సరఫరా, పట్టణాలతో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, గ్రామీణ రహదారుల నిర్మాణం పేరుతో ఈ మూడు ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 

మెత్తం రూ.14,252 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ మూడు ప్రాజెక్టులకు రూ.7000 కోట్ల వరకు నిధులు సమకూర్చడానికి ఏఐఐబీ ఆమోదం తెలిపింది. 24 గంటల విద్యుత్‌ సరఫరా ప్రాజెక్టు పనుల కింద  ఇప్పటి వరకు రూ.224 కోట్లు, గ్రామీణ రహదారుల ప్రాజెక్టు పనుల కింద రూ.221కోట్లు, పట్టణాలలో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థ ప్రాజెక్టు కోసం రూ.7 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి థాకూర్‌ చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టుల కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 24 గంటల విద్యుత్‌ సరఫరా ప్రాజెక్టు 2022 నవంబర్‌ నాటికి, మిగిలిన రెండు ప్రాజెక్టులను 2024 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. 

సీఎస్‌ఆర్‌ నిధులను ఫండ్‌లో జమ చేయాలి
కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌) కింద కేటాయించే నిధులను ఏదైనా పరిశ్రమ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయని పక్షంలో ఆ నిధులను నెల రోజుల వ్యవధిలో ఏదైనా బ్యాంక్‌లో ప్రత్యేకంగా అకౌంట్‌ తెరచి అందులో జమ చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మూడేళ్లపాటు ఖర్చు చేయకుండా ఆ అకౌంట్‌లో మిగిలిన సొమ్మును తృతీయ ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లో చట్టబద్దంగా ఏర్పాటు చేసి ఫండ్‌కు బదలాయించాల్సి ఉంటుందని తెలిపారు. 

Advertisement
Advertisement