కల్యాణం.. కమనీయం | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Published Sat, Feb 8 2014 4:15 AM

Thousands of people worshiping to ramalingeswara temple

వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో చెర్వుగట్టుకు కల్యాణశోభ సంతరించుకుంది. నందివాహనంపై పార్వతి, జడల రామలింగేశ్వరస్వామి వారిని  కొత్తగా రాతితో నిర్మించిన కల్యాణమండపానికి శుక్రవారం తెల్లవారుజామున తీసుకొచ్చారు. బాజా భజంత్రీలు..వేద మంత్రాల నడుమ అర్చకులు కల్యాణ తంతు నిర్వహించారు.  గవ్యాంత మార్జనలు, దీక్షా హోమాలు, నీరాజన మంత్ర పుష్పాలను వైభవంగా చేపట్టారు. సాయంత్రం మన్యుసూక్త శ్రీ సూక్త దూర్గాసూక్త హోమాలు, బలిహరణ చేపట్టారు. సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు.
 
 చెర్వుగట్టు (నార్కట్‌పల్లి) , న్యూస్‌లైన్ : శివనామస్మరణతో చెర్వుగట్టు మార్మోగింది. మంగళవాయిద్యాలు.. భజనలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం తెల్లవారుజామున కన్నులపండువగా జరిగింది. స్వామివారికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నూతన పట్టువస్త్రాలు సమర్పించారు. నూతనంగా రాతితో నిర్మిస్తున్న కల్యాణ మండపాన్ని సంపోక్షణ చేశారు.
 
 అనంతరం నందివాహనంపై స్వామిఅమ్మవార్లను కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. తరువాత వేదపండితుడు అల్లవరపు సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మతో పాటు అ ర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో  కల్యాణతంతును జరిపించారు. సాయంత్రం స్వామి వారి పుష్కరిణిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
 

Advertisement
Advertisement