శబరిమలలో చిక్కుల్లోపడ్డ తెలుగు భక్తులు | Telugu devotees problems at Sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమలలో చిక్కుల్లోపడ్డ తెలుగు భక్తులు

Jun 27 2017 2:04 AM | Updated on Sep 5 2017 2:31 PM

శబరిమలలో తెలియక చేసిన తప్పు తెలుగు భక్తులను చిక్కుల్లోకి నెట్టింది.

ఉయ్యూరు (పెనమలూరు): శబరిమలలో తెలియక చేసిన తప్పు తెలుగు భక్తులను చిక్కుల్లోకి నెట్టింది. ఆలయంలోని ధ్వజస్తంభంపై వేసిన పూజాద్రవ్యాల వల్ల అపచా రం జరగడంతో కృష్ణా జిల్లాకు చెందిన భక్తుల్ని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట, పెద ఓగిరాలకు చెందిన దండమూడి లక్ష్మణ చౌదరి, దండమూడి వెంకట్రావ్, బొమ్మారెడ్డి సత్యనారాయణరెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, గుంటక ఉమామహేశ్వరరెడ్డి వెళ్లారు.

వీరు తీసుకువెళ్లిన పూజా ద్రవ్యాలను ధ్వజస్తంభం ప్రతిష్టించకముందు భూమిలో వేయాలి. వీరు వెళ్లేసరికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించడంతో.. తమ వద్ద ఉన్న పూజా ద్రవ్యాలను వారు ధ్వజస్తంభంపై చల్లారు. దీంతో ఆ ప్రాంతంలో బంగారు తాపడం స్వల్పంగా దెబ్బతింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఐదుగుర్నీ గుర్తించిన దేవస్థానం బోర్డు  వారిని కేరళ పోలీసులకు అప్పగించింది. తమకు తెలియక చేశామని వేరు వేడుకున్నా ఫలితం లేకపోయింది. కాగా, దీనిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement