నీరు–చెట్టు.. అక్రమాల కనికట్టు 

TDP Leaders Corruption In Neeru Chettu Works - Sakshi

టీడీపీ హయాంలో అవినీతి నిగ్గు తేల్చిన విజిలెన్స్‌

ఆధారాలతో సహా బయటపడిన అవకతవకలు 

 ప్రభుత్వానికి నివేదిక  సమర్పణ

నామినేషన్‌ పద్ధతిలో, తప్పుడు కొలతలతో, అక్కరకు రాని పనులతో వందల కోట్లు స్వాహా

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చూస్తే చాలు. అలాగే టీడీపీ హయాంలో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో కొన్నింటిని పరిశీలిస్తే చాలు అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన నీరుచెట్టు పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తేలి్చంది. తమకొచ్చిన ఫిర్యాదుల మేరకు శాంపిల్‌గా కొన్నింటిపై విచారణ చేపట్టగా తీగలాగితే డొంక కదిలినట్టు పెద్ద ఎత్తున అవినీతి బయటపడింది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అధికారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 427.24 కోట్లతో 5696 పనులు చేపట్టగా ఇందులో సగానికి పైగా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. నీరు చెట్టు పనులు ఎంత నాసిరకంగా జరిగాయో ప్రజలందరికీ తెలిసిందే. ఎవరెంత గోల పెట్టినా నాడు పట్టించుకోలేదు. ఇప్పుడా పాపాలు విజిలెన్స్‌ విచారణలో వెలుగు చూశాయి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో నీరు చెట్టు పనులు పచ్చనేతలకు కల్పతరువుగా మారాయి. వారికి నచ్చినంత అంచనాలు రూపొందించుకుని, వాటికి నిధు లు మంజూరు చేయించుకుని, నామినేషన్‌ పద్ధతిలో పనులు కొట్టేసి వందల కోట్లు దిగమింగారు. గ్రామ స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రి వరకు యథేచ్ఛగా నీరు చెట్టు నిధులను దోచేశారు. దోచిన సొమ్ముతో బహుళ అంతస్థుల భవనాలు, ఎకరాల  కొద్దీ భూములు, కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సంపాదించారు. చెరువులో మట్టి తవ్వకాలకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.29 చొప్పన చెల్లించాల్సిన బిల్లులకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.82.80 చెల్లించారు. తవ్విన మట్టిని అమ్ముకుని కోట్లాది రూపాయలు మింగేశారు. ఆ విక్రయించిన మట్టిని నీరు చెట్టు పనుల కింద తవ్వినట్టు బిల్లులు చేసుకున్నారు. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్‌ వాల్, చెక్‌ డ్యామ్‌లు, స్లూయిజ్‌లు... ఇలా రకరకాల కాంక్రీటు పనుల రూపంలో కూడా పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. నాసిరకం పనులు చేపట్టడంతో చేసిన పనులు కొన్నాళ్లకే వర్షాలకు కొట్టుకుపోయాయి. గతంలో చేసిన పనులకు మెరుగులు దిద్ది మరికొన్నిచోట్ల పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. నాసిరకం నిర్మాణ సామగ్రితో మరికొన్నిచోట్ల పనులు చేసి పెద్ద ఎత్తున నిధులు డ్రా చేశారు. కొన్నిచోట్ల పనులు చేయకుండానే చేసినట్టు చూపించారు.  

ప్రభుత్వానికి విజిలెన్స్‌ నివేదిక 
టీడీపీ హయాంలో జరిగిన నీరు చెట్టు అక్రమాలపై పక్కా ఆధారాలతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నివేదిక తయారు చేశారు. ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందో ఉదాహరణతో సహా చూపించారు. అంకెలతో సహా అవినీతి లెక్క తేల్చారు. వీటిన్నింటిపైనా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. విశేషమేమిటంటే ఒకపక్క విజిలెన్స్‌ విచారణలో నీరు చెట్టు పనుల్లో అవినీతి జరిగిందని తేలగా అదే సమయంలో ఆ పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడైతే గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇస్తావా? లేదా? అన్నట్టుగా బెదిరింపులకు సైతం దిగినట్టు సమాచారం.


టెక్కలి మండలం తిర్లంగి సమీపంలోని కొత్త చెరువు  

జిల్లాలో జరిగిన నీరు చెట్టు అక్రమాలివి...  
ఉన్న చెరువు గట్లను బలపడేటట్టు చేయకుండా దానికి బదులు చెరువు గర్భం ఆవల గల ప్రాంతంలో గట్లను వేశారు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్‌ మీటర్‌కు రూ.29కు గాను రూ.82.80 చెల్లించారు. ఈ విధంగా 25 పనులకు రూ.59.08 లక్షలు అధికంగా ఖర్చు చేశారు.
చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా ఉన్న దాని కంటే అ«ధికంగా నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచారు. ఈ లెక్కన రూ.12.52 లక్షలు స్వాహా చేశారు.
తవ్విన మట్టి శ్మశానం, ఇళ్లు వంటి అవసరాలకు కాకుండా ప్రైవేటు రోడ్లకు వేసుకున్నారు. ఈ తరహాలో చూపించిన 8 పనుల ద్వారా రూ.53.21 లక్షలు అక్రమంగా కొట్టేశారు.
చెరువు మధ్యలో రోడ్డు వేసి ఒక పని కింద రూ.2.14 లక్షలు మింగేశారు. 
వర్షాకాలంలో పాడయ్యే తారురోడ్డు బండకి మట్టిని వేశారు. దీనికింద రూ.7.11 లక్షలు తినేశారు.  
ఒక పనికి ఒక అంచనా రూపొందించి, దానికి అదనంగా నిర్మాణం పేరుతో రూ.లక్షా 60 వేలు నొక్కేశారు. యంత్రాలతో చేసే పనిని మనుషులతో చేసినట్టు చూపించి 14 పనులకు గాను రూ.7.61 లక్షలు వెనకేసుకున్నారు.  
పనుల్లో డిజైన్లు డ్రాయింగ్‌ లేకుండా పనిచేసి రూ.76.23 లక్షలు తినేశారు.  
నాలుగు పనులకు తక్కువ పనిచేసి ఎక్కువ నమోదు చేసి రూ.లక్షా 15 వేలు స్వాహా చేశారు. సర్పలెస్‌ వియ్యర్‌కు చెందిన 2 పనులకు కొలతలు తక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.2.62 లక్షలు దుర్వినియోగం చేశారు.  
మట్టిగట్టు వేయడానికి 5 మీటర్ల దగ్గర్లో మట్టిని తవ్వేసి రూ.3.53 లక్షలు దిగమింగారు.
పనుల టెండర్ల వరకు వెళ్లకుండా టీడీపీ నేతలకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టేందుకు ఒక పనిని ముక్కలు ముక్కలుగా విడదీశారు.
తవ్విని మట్టిని ప్రధాన గట్టుపై వేయకుండా ఇతర అవసరాలకు వినియోగించి నిధులు మింగేశారు.
రూ.5 లక్షల విలువ లోపు గల పనులను మాత్రమే నామినేషన్‌ ద్వారా చేపట్టాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలో రూ.50 లక్షల వరకు నామినేషన్‌ పనులను కట్టబెట్టి నిధులు స్వాహా చేశారు.
నిబంధనల ప్రకారం 50 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50 ఎకరాల కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు చేసి నిధులు దుర్వినియోగపరిచారు.
గడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎటువంటి డిజైన్‌ లేకుండా చెక్‌ డ్యామ్‌లను నిర్మించారు.
నీరు చెట్టు కార్యక్రమంలో రక్షణ గోడలు నిర్మించరాదు. కానీ అందుకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవునా రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top