ఇసుకపై ‘పచ్చ’ మాఫియా | tdo leaders are in sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుకపై ‘పచ్చ’ మాఫియా

Aug 5 2014 12:01 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుకపై ‘పచ్చ’ మాఫియా - Sakshi

ఇసుకపై ‘పచ్చ’ మాఫియా

ఇసుకను పిండి, కోట్లు కొల్లగొడుతున్న ‘పచ్చ’ మాఫియా జడలు విప్పుతోంది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇసుకను పిండి, కోట్లు కొల్లగొడుతున్న ‘పచ్చ’ మాఫియా జడలు విప్పుతోంది. రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.2 వేల కోట్లు ఆదాయం సమకూర్చే ఇసుకకు విధివిధానాల రూపకల్పన జాప్యానికి టీడీపీ నేతల లాబీయింగే కారణమన్న ఆరోపణ వినిపిస్తోంది. రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరిస్తుంటే.. జిల్లాలో ఇసుకాసురులు మాత్రం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో అమలైన లాటరీ విధానమే కొనసాగించేలా లాబీయింగ్ నడుపుతున్నారు. నూతన విధానం ఖ రారు కోసం ఏర్పాటైన కమిటీని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
 
గత ప్రభుత్వ హయాంలో ఉభయగోదావరి జిల్లాల్లో రద్దయిన ఇసుక రీచ్‌ల నుంచే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అప్పటి మంత్రి, ఆయన సమీప బంధువైన ఒక ఎన్‌ఆర్‌ఐ అడ్డంగా కోట్లు కొల్లగొట్టేశారు. వారు పార్టీ మారి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున గోదావరి జిల్లాల్లో ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు రూ.30 కోట్లు వరకు ఖర్చు చేశారు. ఇందుకు రాజకీయంగా వారికి ప్రాతినిధ్యం, ఇసుక రీచ్‌ల కేటాయింపులో నిర్ణయాత్మక పాత్ర ఉండేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన
 సంబంధిత మంత్రితో లాటరీ విధానంపై.. ఇసుక రీచ్‌ల నిర్వహణలో చేయి తిరిగిన మాజీ మంత్రి, ఎన్‌ఆర్‌ఐ, నలుగురు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు రాజమండ్రిలో అధికారపార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఇంట సమాలోచనలు జరిపారని తెలిసింది.
 
 అక్రమార్కుల అడ్డా...
గోదావరి జిల్లాల్లో 34 రీచ్‌ల వరకు ఉన్నాయి. గత పాలకులు అప్‌సెట్ ధర నిర్ణయించి లాటరీ విధానాన్ని అనుసరించారు. లాటరీలో ఒక్కో రీచ్‌లో 15 వేల క్యూబిక్ మీటర్ల లోపు ఇసుక తవ్వుకునేందుకు అనుమతించారు. ఒక రీచ్‌కు రూ.కోటికి మించి ధర (క్యూబిక్ మీటరుకు రూ.600) నిర్ణయించే అవకాశం కమిటీకి ఉండదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీమంత్రి, ఎన్‌ఆర్‌ఐ సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం లాటరీ విధానం కోసమే లాబీయింగ్ నడుపుతున్నారు. బహిరంగ వేలం నిర్వహిస్తే రీచ్‌లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వేలం మొత్తంలో 50 శాతం జమ చేయాల్సి ఉండడంతో  లాటరీ విధానాన్నే కొనసాగించాలని పలువురు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
 
వారంతా గత ప్రభుత్వ హయాంలో లాటరీ విధానంతో రీచ్‌లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల మాటున అడ్డగోలుగా కోట్లు కూడబెట్టిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంతోనే లాటరీ విధానం కోసం గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం. లాటరీ విధానమైతే  34 రీచ్‌లు చేజిక్కించుకునే వారిని దారికి తెచ్చుకుని వాటాదారులవ్వాలనేది ఎత్తుగడ. లాటరీ విధానంలో ఆ రీచ్‌లకు జమ చేయాల్సిన రూ.20 కోట్లకు (సగం వాటా పొందేందుకు) రూ.10 కోట్లు సమకూరిస్తే చాలన్నది వారి వ్యూహం. పాటదారు రీచ్‌లలో వాటా ఇవ్వకుంటే సంబంధిత మం త్రి, అధికారుల ద్వారా నిబంధనల పేరుతో ఒత్తిడి చేసి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారు.
 
మహిళలు నెగ్గుకు రావడం అసాధ్యమే..
బహిరంగ టెండర్లు నిర్వహిస్తే ఉభయగోదావరి జిల్లాల్లో 34 రీచ్‌లకు  సుమారు రూ.200 కోట్లు వస్తుంది. అప్పుడు రూ.100 కోట్లు చెల్లిస్తే తప్ప రీచ్‌లలో సగం వాటా లభించే అవకాశమే లేదు. అంత మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే లాటరీ విధానమే కావాలని వారు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. 

ప్రభుత్వం మహిళా సంఘాలకు 25 శాతం కమిషన్ ఇచ్చే ప్రాతిపదికన రీచ్‌లు అప్పగించినా వారిని బినామీలుగా మార్చి ఇసుక మాఫియా గుప్పెట్లో పెట్టుకునే అవకాశం ఉంది. మహిళా సంఘాలు కాదన్నా.. మాఫియా పట్టున్న ఈ రంగంలో నెగ్గుకు రావడం అసాధ్యమంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement